‘ట్రంప్’ ను చరిత్ర గుర్తుంచుకుంటుంది: ఇజ్రాయెల్ ప్రధాని

అమెరికా బలం ద్వారా శాంతిని సృష్టించిదన్న బెంజమిన్ నెతన్యాహూ;

Update: 2025-06-22 07:36 GMT
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. అమెరికా నిర్ణయం చరిత్రను మార్చేసిందని, ట్రంప్ చాలా ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నాడని కొనియాడారు.

అమెరికా బలం ద్వారా శాంతిని సృష్టించిందని, ఈ ప్రాంతం ఇంటా, బయట ప్రశాంతత నెలకొంటుందని అన్నారు. ఈ నిర్ణయం గల్ప్ ప్రాంతంలో ఉజ్వల భవిష్యత్ కు దారి తీస్తుందని పేర్కొన్నారు.
‘‘యూఎస్ఏ అద్భుతమైన, న్యాయమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ(ట్రంప్) నిర్ణయం నిజంగా అద్వితీయమైనది. ఈ నిర్ణయం చరిత్ర గతిని మారుస్తుంది’’ అని యూదు ప్రధాని చెప్పారు.
‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఇజ్రాయెల్ నిజంగా అద్భుతమైన పనులు చేసింది. కానీ ఈ రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన చర్యలో, అమెరికా మహాద్భుతం చేసంది. భూమిపై మరే దేశం ఇలా చేయలేనిది, అది చేసి చూపింది’’ అని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం..
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జూన్ 13 న ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. అణు కేంద్రాలతో పాటు దాని బాలిస్టిక్ మిస్సైల్ ల ఉత్పత్తి కేంద్రాలతో నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇరాన్ అణు శక్తి సాధించడం తనకు అత్యంత ముప్పుగా ఇజ్రాయెల్ భావించింది. ఎంతకు తెగించి అయిన టెహ్రాన్ అణు లక్ష్యాన్ని నాశనం చేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేసింది.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనలో, ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడాన్ని ట్రంప్ అడ్డుకోవడం చరిత్ర గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్ నాయకుడు అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం మధ్యప్రాచ్యంలో శ్రేయస్సును, శాంతికి భరోసా కల్పించాయని చెప్పారు.
బలం ద్వారా శాంతి..
‘‘అధ్యక్షుడు ట్రంప్, నేను తరుచుగా చెప్పేది ఒకటే మాట. బలం ద్వారానే శాంతి. మొదట బలం వస్తుంది. తరువాత శాంతి వస్తుంది’’ అని ఆయన అన్నారు. నిన్న రాత్రి యూఎస్, ట్రంప్ చాలా శక్తివంతంగా వ్యవహరించాయని ఆయన చెప్పారు.
అవసరమైతే ఇరాన్ అణు కేంద్రాలను తానే చేస్తానని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, త్వరగా నాశనం కావాలంటే మాత్రం అమెరికా బరిలోకి దిగాలని కోరింది. తాజాగా దాని అభ్యర్థనను ట్రంప్ మన్నించి ఇరాన్ పై దాడులు చేయించారు.
అయితే పాశ్చాత్య దేశాల వాదనలను ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాము కేవలం శాంతియుత అవసరాలకే వీటిని వాడుతామని తెలిపింది. కొన్నాళ్లు అంతర్జాతీయ పరిశీలనకు సైతం ఒప్పుకుంది. కానీ ఇజ్రాయెల్ దాడితో వీటికి బ్రేక్ పడింది.


Live Updates
2025-06-22 12:59 GMT

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానికి దాడులు చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మధ్య సంభాషణలు జరుగుతాయన్న వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ ఇప్పట్లో లేదని

రష్యా అధ్యక్ష భవనం నుంచి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. అవసరం అనుకున్నప్పుడు ఫోన్ కాల్ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై రష్యా విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్ లియోనిడ్ స్లుట్స్కీ అమెరికాపై ఘాటుగా స్పందించారు. యుద్ధం పూర్తిగా రాజకీయదురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. ఇరాన్‌లో పాలన మార్చాలనే కుట్రలో ట్రంప్ భాగమైనట్టే కనిపిస్తోందన్నారు. అయితే అమెరికా దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. "మూడు అణు కేంద్రాలపై దాడి చేసి అమెరికా ఏం సాధించింది? అని ప్రశ్నించారు.  

2025-06-22 11:37 GMT

ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్లో మాట్లాడారు. 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణలో ప్రస్తుత పరిస్థితి గురించి ఇరాన్ అధ్యక్షుడు ప్రధానికి వివరించినట్లు సమాచారం.

"ఇరాన్ అధ్యక్షుడు @drpezeshkian తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి గురించి మేము వివరంగా చర్చించాము. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసాము. ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి మరియు ముందుకు సాగడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, సంభాషణ మరియు దౌత్యం కోసం మా పిలుపును పునరుద్ఘాటించాము" అని ప్రధాని మోదీ X లో రాశారు.

‘‘ఇరాన్ అధ్యక్షుడు @drpezeshkian గారితో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించాం. ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, ఇరు దేశాలు చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో మసౌద్‌కు సలహా ఇచ్చాను.’’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇరాన్‌పై అమెరికా దాడి..

ఇరాన్ అణు కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్‌లోని మూడు ప్రాంతాలపై అగ్రరాజ్యం వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులకు తెగబడింది.

ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఇక దౌత్యానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.

పశ్చిమాసియా దేశాలతో (ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్) భారతదేశానికి విస్తృత వాణిజ్య సంబంధాలున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారతదేశం ఎగుమతులు $1.24 బిలియన్లుగా ఉన్నాయి. వీటిలో బాస్మతి బియ్యం ($753.2 మిలియన్లు), అరటిపండు ($53.2 మిలియన్లు), సోయా మీల్ ($70.6 మిలియన్లు), బెంగాల్ పప్పు ($27.9 మిలియన్లు) టీ ($25.5 మిలియన్లు) ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు $441.8 బిలియన్లుగా ఉన్నాయి.

2025-06-22 10:27 GMT

ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా దాడులను వామపక్షాలు ఖండించాయి. అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రకారం దాడులను "తీవ్ర ఉల్లంఘన"గా పేర్కొన్నాయి. ఈ దాడులు ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపుతాయని, భారత్‌పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ హెచ్చరించారు. అమెరికా తీరుకు నిరసనగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దిపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. "ప్రపంచంలోని శాంతికాముకులు అమెరికా దౌర్జన్యాన్ని ఖండించాలి" అని కోరారు.

"ఇరాక్, లిబియా, సిరియాల తరవాత అమెరికా-ఇజ్రాయిల్ దౌర్జన్యానికి ఇరాన్ బలైంది. మొత్తం పశ్చిమ ఆసియాను అస్థిరపరిచి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వీరి లక్ష్యం," అని భట్టాచార్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అన్యాయమైన యుద్ధంలో భారత్ అమెరికా-ఇజ్రాయిల్ కూటమికి మద్దతివ్వకూడదు," అని ఆయన స్పష్టం చేశారు.

2025-06-22 09:26 GMT

ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులతో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు రాజనీతికి పిలుపునిస్తూ స్పందించాయి. ఈ దాడులు ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉన్నదని నేతలు హెచ్చరిస్తున్నారు.

"ప్రాంతీయ పోరులో లెబనాన్ తలదూర్చదు. జాతీయ ప్రయోజనాల దృష్టితో మేము దూరంగా ఉండాలనుకుంటున్నాం, " అని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం స్పష్టం చేశారు.

ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. "యుద్ధం అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలకు రాజనీతే ఏకైక పరిష్కారం" అని గుటెరెస్ పేర్కొన్నారు.

చర్చల ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ అన్నారు.

ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీలు, హమాస్ గ్రూపులు అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి. హౌతీలు "అమెరికా-సియోనిస్టుల దురాగ్రహానికి" వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించాయి. ముస్లిం దేశాలన్నీ “జిహాద్, ప్రతిఘటన” పంథాలో పనిచేయాలని పిలుపునిచ్చాయి.

చైనా ప్రభుత్వ మీడియా 'CGTN'.. "అమెరికా మళ్లీ ఇరాక్‌లో చేసిన తప్పునే ఇరాన్‌లోనూ చేస్తున్నదా?" అని ప్రశ్నించింది. "మధ్యప్రాచ్యంలో జరిపే సైనిక దాడులు ఎప్పుడూ అనూహ్యమైన పరిణామాలకు దారి తీస్తున్నాయి. స్థిరత్వం కోసం రాజనీతే మార్గం" అని పేర్కొంది.

దక్షిణ కొరియా అధ్యక్ష భవనంలో అత్యవసర భద్రతా సమీక్ష జరిగింది. తమ ప్రజల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని జాతీయ భద్రతా సలహాదారు సూచించారు. జపాన్ ప్రధాని శిగేరు ఇషిబా కూడా కీలక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారని జపాన్ NHK టెలివిజన్ పేర్కొంది.

ఇరాన్‌లో తమ రాయబారి కార్యాలయాన్ని మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. "ఇది శాంతికి అనుకూల సమయం. ఉద్ధేశపూర్వక చర్చలు జరగాలి. పరిష్కారానికి సైనిక మార్గం సరికాదు," అని పేర్కొంది.

2025-06-22 08:43 GMT

ఇరాన్‌లోని డెజ్‌ఫుల్ విమానాశ్రయంపై దాడి చేసి అక్కడ ఉన్న రెండు F-5 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇజ్రాయిల్ పేర్కొంది. దాడులకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఒక విమానం పేలిపోవడం కనిపిస్తుంది.

ఇజ్రాయెల్ గతంలో ఇరాన్‌కి చెందిన పాత F-14 విమానాలపై కూడా దాడులు చేసింది. అయితే అవి వాడకంలో ఉన్న విమానాలా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు.

ఇస్ఫహాన్ విమానాశ్రయం చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలపై కూడా దాడులు చేశామని ఇజ్రాయిల్ చెప్పుకుంటున్నా.. ఇరాన్‌ మాత్రం ఇప్పటివరకు తమకు జరిగిన నష్టాన్ని బహిరంగంగా చెప్పడం లేదు.

ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌పై దాడిలో భాగంగా తాము ఖోరమ్‌షహ్ర్-4 సహా మొత్తం 40 క్షిపణులు ప్రయోగించామని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డు ప్రకటించింది. ఖోరమ్‌షహ్ర్-4 క్షిపణి అనేక వార్‌హెడ్‌లను తీసుకెళ్లగలదని ఇరాన్ చెబుతోంది.

2025-06-22 08:30 GMT

తమ దేశం మూడు ఇరానియన్ అణు కేంద్రాలు - ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ - ఫోర్డోలోని అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిందని అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. దాడుల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌లోని అణు కేంద్రాలను పూర్తిగా తుడిచిపెట్టామని చెప్పారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఈ దాడులను ఖండించారు. "ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టం NPT ఉల్లంఘనకు పాల్పడింది.’’ అని పేర్కొన్నారు.

అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణుల దాడిని ప్రయోగించింది. టెల్ అవీవ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక పేలుళ్లు సంభవించాయని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి లాంచర్లు సహా సైనిక లక్ష్యాలపై తాజాగా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన వారం తర్వాత శుక్రవారం (జూన్ 20, 2025) ఇరు దేశాల మధ్య దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కీలక యూరోపియన్ మంత్రులు జెనీవాలో ఇరాన్ ఉన్నత దౌత్యవేత్తతో సమావేశమై వివాదాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. కానీ వారం రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాశ్చాత్య, ఇరానియన్ అధికారుల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి సమావేశం 4 గంటల తర్వాత తక్షణ పురోగతికి సంకేతాలు లేకుండా ముగిసింది. 

Tags:    

Similar News