అమెరికా దాడులపై ప్రపంచ దేశాల స్పందనలు

ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులతో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు రాజనీతికి పిలుపునిస్తూ స్పందించాయి. ఈ దాడులు ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉన్నదని నేతలు హెచ్చరిస్తున్నారు.

"ప్రాంతీయ పోరులో లెబనాన్ తలదూర్చదు. జాతీయ ప్రయోజనాల దృష్టితో మేము దూరంగా ఉండాలనుకుంటున్నాం, " అని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం స్పష్టం చేశారు.

ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. "యుద్ధం అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలకు రాజనీతే ఏకైక పరిష్కారం" అని గుటెరెస్ పేర్కొన్నారు.

చర్చల ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ అన్నారు.

ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీలు, హమాస్ గ్రూపులు అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి. హౌతీలు "అమెరికా-సియోనిస్టుల దురాగ్రహానికి" వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించాయి. ముస్లిం దేశాలన్నీ “జిహాద్, ప్రతిఘటన” పంథాలో పనిచేయాలని పిలుపునిచ్చాయి.

చైనా ప్రభుత్వ మీడియా 'CGTN'.. "అమెరికా మళ్లీ ఇరాక్‌లో చేసిన తప్పునే ఇరాన్‌లోనూ చేస్తున్నదా?" అని ప్రశ్నించింది. "మధ్యప్రాచ్యంలో జరిపే సైనిక దాడులు ఎప్పుడూ అనూహ్యమైన పరిణామాలకు దారి తీస్తున్నాయి. స్థిరత్వం కోసం రాజనీతే మార్గం" అని పేర్కొంది.

దక్షిణ కొరియా అధ్యక్ష భవనంలో అత్యవసర భద్రతా సమీక్ష జరిగింది. తమ ప్రజల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని జాతీయ భద్రతా సలహాదారు సూచించారు. జపాన్ ప్రధాని శిగేరు ఇషిబా కూడా కీలక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారని జపాన్ NHK టెలివిజన్ పేర్కొంది.

ఇరాన్‌లో తమ రాయబారి కార్యాలయాన్ని మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. "ఇది శాంతికి అనుకూల సమయం. ఉద్ధేశపూర్వక చర్చలు జరగాలి. పరిష్కారానికి సైనిక మార్గం సరికాదు," అని పేర్కొంది.

Update: 2025-06-22 09:26 GMT

Linked news