మీ పార్టీ వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారు
ఆక్వా రైతులను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారులు సిండికేట్ అయి దోచుకుంటున్నారు అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.;
ఆక్వారంగం సంక్షోభంపై ఆయన సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.
సీబీఎన్ గారూ... ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడంలేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే.
ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. కోవిడ్ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం. మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదు.
గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్ పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. ఆక్వాజోన్స్లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు అని చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.