అన్నా, చెల్లెళ్ళ సెంటిమెంట్ రిపీటవుతుందా ?

తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధి, ప్రియాంకగాధీల సెంటిమెంటు కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా ?

Update: 2024-05-07 09:21 GMT

తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధి, ప్రియాంకగాధీల సెంటిమెంటు కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా ? ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా విడివిడిగా చెరో 15 సార్లు పర్యటించారు. పర్యటించిన ప్రతిసారి పార్టీ వీళ్ళతో తక్కువలో తక్కువ రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించింది. అనేక అంశాలకు తోడు వీళ్ళ ఆకర్షణ, ప్రచారం కూడా కలిసొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే తెలంగాణా కాంగ్రెస్ లో అన్నా, చెల్లెళ్ళ ప్రచారం ఒక సెంటిమెంటుగా స్ధిరపడిపోయింది.

అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే ఒక విడత అన్నా, చెల్లెళ్ళు ప్రచారం చేశారు. తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈమధ్యనే నిర్మల్, గద్వాలలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. 9వ తేదీన కరీంనగర్, కూకట్ పల్లి, సరూర్ నగర్ బహిరంగసభల్లో రాహుల్ పాల్గొంటున్నారు. అలాగే 10వ తేదీన కామారెడ్డి, షాద్ నగర్, తాండూరు బహిరంగసభల్లో ప్రియాంక పాల్గొనబోతున్నారు. 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం పూర్తయిపోతుంది కాబట్టి అవకాశం ఉంటే ఇద్దరితోను హైదరాబాద్ నగరంలో భారీ రోడ్డుషోను నిర్వహించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తోంది.

పార్టీ ఎన్నికల ప్రచారంలో గ్యారెంటీగా పార్టీ గెలుస్తుందని అనుకున్న నియోజకవర్గాల్లో అన్నా, చెల్లెళ్ళతో ప్రచారంచేయించలేదు. ప్రత్యర్ధుల నుండి టఫ్ ఫైట్ ఉండి, గెలుపు విషయంలో వెనకబడ్డామని అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువగా ప్రచారం చేయించింది. ఇదే సమయంలో దేశమంతా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అన్నా, చెల్లెళ్ళు తెలంగాణాకు కేటాయించిన సమయం కూడా తక్కువే. మొత్తంమీద రాహుల్, ప్రియాంక ప్రచారం వల్ల కాంగ్రెస్ అభ్యర్ధులు లబ్దిపొందుతారని, గెలుపు అవకాశాలు ఎడ్జిలో ఉన్న చోట్ల గెలుపు గ్యారెంటీ అని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News