సమస్యలకు చంద్రబాబు, రేవంత్ అయినా పరిష్కారం చూపుతారా ?

తెలంగాణ-ఏపిలోని జనాలు కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారమైపోయి ఎవరిపని వాళ్ళు హాయిగా చేసుకోవాలని కోరుకుంటున్నారు;

Update: 2025-06-24 07:39 GMT
Chandrababu and Revanth Reddy

తెలుగురాష్ట్రాల మధ్య విభజన సమస్యలు రావణకాష్టంలాగ మండుతునే ఉన్నాయి. విభజన సమస్యలే ఇంకా పరిష్కారం కావటంలేదని ఒకవైపు గోల పెరిగిపోతుంటే అదనంగా మరోసమస్య వచ్చిపడింది. ఏ రాష్ట్రంలో జనాలైన ప్రశాంతజీవనాన్నే కోరుకుంటారనటంలో సందేహంలేదు. అదేమాదిరిగా తెలంగాణ-ఏపిలోని జనాలు కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారమైపోయి ఎవరిపని వాళ్ళు హాయిగా చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే కొందరు రాజకీయనేతలు మాత్రం రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు ఎప్పటికి పరిష్కారం కాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లున్నారు. దీనికి కారణం ఏమిటంటే సెంటిమెంటును రాజేస్తేకాని తమ పబ్బం గడవదన్న కుటిల బుద్ధే. ఇపుడు విషయం ఏమిటంటే విభజన సమస్యలకు అదనంగా వచ్చిన సరికొత్త సమస్య ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం.

2014లో యూపీఏ ప్రభుత్వం అనేక చిక్కుముడులతోనే సమైక్య ఏపీని రెండు ముక్కలుగా విభజించింది. పోని చిక్కుముడులకు పరిష్కారం చూపించిందా అంటేలేదు. చిక్కుముడులతో రాష్ట్రాన్ని విభజించిన కేంద్రప్రభుత్వం సమస్యల పరిష్కారం మీరే చేసుకోండని రాష్ట్రాలకు వదిలేసింది. 2014లో తెలంగాణలో కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అయితే ఏపీకి చంద్రబాబు(Chandrababu Naidu) సీఎం అయ్యారు. తర్వాత జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఏమిచేశారంటే 2015, మార్చిలో బీఆర్ఎస్ నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్ ఓటును కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఓటును కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారనేందుకు ఆధారం ఏమిటంటే అప్పటి టీడీపీ(TDP) ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి(Revanth) నామినేటెడ్ ఎంఎల్ఏ ఇంట్లో రు. 50 లక్షలు ఇస్తు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోవటమే. ఈ విషయాలన్నింటినీ కేసీఆర్ అనేకసార్లు బహిరంగంగానే ఆరోపించారు.

అప్పటినుండి కేసీఆర్-చంద్రబాబు మధ్య రాజకీయంగా ఎన్నో వివాదాలు పెరిగిపోయాయి. వీళ్ళమధ్య వైరం కారణంగా విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక్కసమావేశం కూడా జరగలేదు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి సీఎం అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) అధికారంలోకి వచ్చారు. కేసీఆర్-జగన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి విభజన సమస్యలు పరిష్కారమవుతాయేమో అనుకుంటే ఏమీ కాలేదు. ఇద్దరూ రెండు, మూడుసార్లు భేటీ అయినా ఏఒక్క సమస్యకూ పరిష్కారం దొరకలేదు. ఇద్దరికీ విభజన సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు అనిపించలేదు. ఇద్దరూ గట్టిగా తలచుకుని ఉండుంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యుండేవే అనటంలో సందేహంలేదు.

సరే, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు రేవంత్-జగన్ మధ్య ఒక్క సమావేశం కూడా జరగలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు కాబట్టి. 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోయి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. వెంటనే చాలామంది సంతోషించారు. ఎందుకంటే ఇప్పటికైన విభజన సమస్యలు పరిష్కారమవ్వాలని కోరుకున్నారు. కారణం ఏమిటంటే చంద్రబాబు-రేవంత్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికైనా విభజన సమస్యలు పరిష్కారం అవుతాయేమో అనుకుంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం రూపంలో కొత్తసమస్య పుట్టుకొచ్చింది.

బనకచర్ల వివాదం ఏమిటి ?

తెలంగాణ ప్రభుత్వం సమ్మతిలేకుండానే ఏపీలోని కర్నూలులో బనచకర్ల ప్రాజెక్టు నిర్మించాలని చంద్రబాబు స్పీడుగా పావులు కదుపుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ చాలా ఇబ్బందులు పడుతుందని బీఆర్ఎస్ సమస్యను లేవదీసింది. గోదావరి నది ద్వారా సముద్రంలో కలుస్తున్న వరదజలాలు 3 వేల టీఎంసీల్లో తాము 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్లు చంద్రబాబు, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయడు చెబుతున్నారు. అయితే ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల గోదావరిలో వరదజలాలు తగ్గిపోతాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు నానా రచ్చచేస్తున్నారు. బనకచర్లను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రాజేసి జనాలను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడంటు రేవంత్ ను హరీష్ పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తమకున్న మీడియా, సోషల్ మీడియా బలంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ కు వ్యతిరేకంగా రచ్చ రచ్చ చేస్తున్నారు హరీష్.

ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టమూ జరగదని శాస్త్రీయంగా రేవంత్ ప్రభుత్వం జనాలకు గట్టిగా చెప్పలేకపోతున్నది. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలకు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అన్నది అదనపు సమస్యగా తయారైంది. ఈఅదనపు సమస్యను పరిష్కరించుకునేందుకు తానే చొరవ తీసుకుంటానని ఈమధ్యనే రేవంత్ ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి చొరవచూపించటం అన్నివిధాలుగా ఆహ్వానించతగ్గ పరిణామమే. అందుకు రేవంత్ ను అభినందించాల్సిందే. అయితే సమస్య పరిష్కారం విషయంలో ఇటు రేవంత్ అటు చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ది ఉన్నది అన్నదే తేలాలి. చంద్రబాబు చెబుతున్నట్లు గోదావరిలో వరదజలాలు అన్నది భారీవర్షాలు కురిసినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. కురవాల్సిన వర్షాలకన్నా తక్కువ వర్షపాతం నమోదైనపుడు గోదావరి నదిలో అసలు నీరే ఉండనపుడు వరదజలాలు ఎక్కడినుండి వస్తాయి ? బనకచర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు నీళ్ళు ఎక్కడినుండి తెస్తారు ?

చత్తీస్ ఘడ్ ఏమిచేస్తోంది ?

తెలంగాణ ఎగువ రాష్ట్రం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను రెడీచేస్తోంది. 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు వీలుగా రు. 49 వేల కోట్ల వ్యయంతో బోధ్ ఘాట్, మహానది-ఇంద్రావతి లింకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆరంభించింది. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైనా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊపందుకుంది. ఈరెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే అప్పుడు తెలంగాణ గోదావరి(Godavari River)లోకి నీరు రావటమే తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాంటపుడు తెలంగాణ ప్రాజెక్టులను దాటుకుని బనకచర్ల ప్రాజెక్టులోకి నీరుచేరే అవకాశమే లేదన్నది కొందరు నిపుణుల వాదన. రేవంత్-చంద్రబాబు భేటీలో ఇలాంటి అనేక అంశాలు చర్చకు రాకుండా ఉండవు. మరప్పుడు బనకచర్లతో పాటు దీర్ఘకాలంగా పెండింగులోనే మగ్గుతున్న విభజన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ? మనిషి ఆశాజీవి కదా అన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే అనుకుందాం.

Tags:    

Similar News