జగన్ సభకు ఇంత జనమేమిటి?

జగన్ బయటకు వెళితే జనం తండోప తండాలుగా వస్తున్నారు. రెంటపాళ్లలో ఇంత జనం ఎందుకు వచ్చారనేది చర్చగా మారింది.;

Update: 2025-06-18 13:25 GMT
సత్తెనపల్లి గడియార స్తంభం సెంటర్ లో జన సందోహం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు జనం భారీగా రావడం వెనుక ఏమి జరుగుతోందనే చర్చ మొదలైంది. ఆయన సత్తెనపల్లె నుంచి రెంటపాళ్ల వెళ్లే వరకు జనం ఆయన వెళుతున్న రహదారి వెంట పరుగులు పెడుతూనే ఉన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద గుంపులు గుంపులుగా జనం జగన్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. షేక్ హ్యండ్ ఇచ్చేందుకు ఎక్కవ మంది జనం ప్రధానంగా యువతీ యువకులు ఎగబడ్డారు. సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్ జనంతో నిండిపోయింది.

గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అడ్డగించారు. చాలా చోట్ల పోలీసులు నాయకుల కార్లు ఆపివేశారు.

ఆయన తన ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి, కార్యకర్తలతో బలమైన అనుబంధం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విధంగా జనం రావడం చూస్తుంటే ప్రజాదరణ ఉందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక శక్తిగా కొనసాగుతారని పలువురు భావిస్తున్నారు.


ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలం కేంద్రం పరిశీలనకు వెళ్ళారు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే జనం భారీ సంఖ్యలో తరలివచ్చి "సీఎం.. సీఎం.." అంటూ నినాదాలు చేశారు.

ప్రభుత్వం రెంటపాళ్ల సందర్శనపై పలు ఆంక్షలు విధించింది. కేవలం వందల మంది మాత్రమే ఉండాలని, అనుమతి లేకుండా జనం ఎక్కువ మంది వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా జనం పట్టించుకోలేదు. మృతి చెందిన నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఈ సందర్భంగా జగన్ ఆవిష్కరించారు. ఆ సందర్భంలో రోడ్లన్నీ రెంటపాళ్లలో కిక్కిరిసాయి.


జగన్ పాలనలో అమలైన "నవరత్నాలు" వంటి సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్‌లు, పేదలు, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చాయని భావిస్తారు. ఈ పథకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్‌కు బలమైన మద్దతు దారులను సృష్టించాయని చెప్పొచ్చు.

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ జగన్ ప్రజల్లోకి వెళ్లడం ఆపలేదు. రెంటపాళ్ళలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం, పొదిలిలో పొగాకు రైతుల సమస్యలను పరిశీలించడం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే అక్కడికి కూడా జనం విపరీతంగా వచ్చారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించినప్పటికీ, జగన్‌కు ఇంకా గణనీయమైన ప్రజా మద్దతు ఉందని ఈ పర్యటనలకు వచ్చిన జనసందోహం సూచిస్తోంది.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి, ముఖ్యంగా రైతులు, కార్యకర్తలపై వేధింపులు, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలు జగన్ పర్యటనలకు జనాన్ని ఆకర్షిస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు.

జగన్‌కు ఉన్న గ్రామీణ మద్దతు, ఆయన పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ఈ సమీకరణను సహజసిద్ధంగా చేస్తున్నాయని వైఎస్ఆర్‌సీపీ సమర్థిస్తోంది. పోలీసు ఆంక్షలు, కార్యకర్తలపై కేసులు వంటి అడ్డంకులు ఉన్నప్పటికీ, జగన్ పర్యటనలకు జనం రావడం ఆయన ప్రజాదరణను సూచిస్తోందని అంటున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో తండ్రి అకాల మరణం తర్వాత, జగన్ "ఓదార్పు యాత్ర" ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ యాత్రలో ఆయన ప్రజల సమస్యలను సమీపంగా గమనించి, వారి గుండెల్లో చోటు సంపాదించారు. 2011లో వైఎస్ఆర్‌సీపీని స్థాపించిన తర్వాత, 2019 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ 151 అసెంబ్లీ సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయం ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.

9 కిలోమీటర్ల దూరం, 1300 మంది పోలీసులు, 50 మంది SI లు, 20 మంది సిఐ లు, 8 మంది డియస్పీలు, 5 మంది అడిషనల్ SP లు, 25 చెక్ పోస్టులు, 40 చోట్ల భారీ కేడ్లు ఏర్పాటు చేసి జగన్ కార్యక్రమంలో వెంట నడుస్తున్న జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా జనం ఆగలేదు. ప్రభుత్వం ఇంత మంది పోలీసులను ఉపయోగించినా ప్రయోజనం కనిపించకపోవడాన్ని ఏ విధంగా చూడాలనే దానిపై చర్చ మొదలైంది. 

Tags:    

Similar News