ఏపీ ఈఏపీసెట్‌లో తెలంగాణ విద్యార్థి టాప్‌

అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో కూడా తెలంగాణ విద్యార్థులు మెరిసారు.;

Update: 2025-06-08 16:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌–2025లో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రథమ ర్యాంకు సాధించాడు. హైదరబాద్‌ వనస్థలిపురంకు చెందిన అవనగంటి అనిరుథ్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 96.39 స్కోరు సాధించి చరిత్ర సృష్టించాడు. రెండు, మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భానుచరణ్‌రెడ్డి 95.57 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. తర్వాత స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ నిలిచాడు. పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ 94.75 స్కోరు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.

ఎనిమిదో ర్యాంకు తప్ప తక్కిన ర్యాంకులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. నంద్యాల జిల్లా తిమ్మాపురంకు చెందిన యు రామచరణ్‌రెడ్డి నాలుగో ర్యాంకు సాధించగా, అనంతపురం న్యూటౌన్‌కు చెందిన భూపతి నితిన్‌ అగ్నిహోత్రి ఐదో ర్యాంకు, గుంటూరుకు చెందిన టీ విక్రమ్‌ ఆరో ర్యాంకు, చిత్తూరు జిల్లాకు చెందిన దేశిరెడ్డి మణిదీప్‌రెడ్డి ఏడో ర్యాంకు, హన్మకొండ వడ్డేపల్లికి చెందిన ఎస్‌ త్రిశూల్‌ ఎనిమిదో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి తొమ్మిదో ర్యాంకు, నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్‌ పదో ర్యాంకు సాధించారు. 

ఇక అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో కూడా తెలంగాణ విద్యార్థులు మెరిసారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రామాయణం వెంకట నాగసాయి హర్షవర్థన్‌ ప్రథమ ర్యాంకు సాధించాడు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన షన్ముఖ నిశాంత్‌ అక్షింతల రెండో ర్యాంకు, కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన డేగల అకీరనంద వినయ్‌ మల్లేష్‌ కుమార్‌ మూడో ర్యాంకు, హన్మకొండ వడ్డేపల్లికి చెందిన వై షణ్ముఖ్‌ నాలుగో ర్యాంకు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన యెలమోలు సత్య వెంకట్‌ ఐదో ర్యాంకు, కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్థన్‌ ఆరో ర్యాంకు, విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన జీ లక్ష్మీ చరణ్‌ ఏడో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దర్భ కార్తిక్‌ రామ్‌ కిరీటి ఎనిమిదో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా చాగళ్లుకు చెందిన కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ తొమ్మిదో ర్యాంకు, కాకినాడ జిల్లా తొండంగికి చెందిన దేశిన సూర్య చరణ్‌ పదో ర్యాంకు సాధించారు. కాకినాడ జేఎన్టీయూ వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం ఏపీ ఈఏపీసెట్‌–2025 ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,40,300 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల్లో 75.67 శాతం విద్యార్థుల అర్హత సాధించినట్లు వెల్లడించారు.
Tags:    

Similar News