షర్మిల హౌస్ అరెస్ట్..ఎందుకంటే
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా వైఎస్ షర్మిలను హౌస్ అరెస్టు చేశారు.;
By : The Federal
Update: 2025-04-30 08:27 GMT
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బుధవారం ఆమె పర్యటించాలని భావించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బుధవారం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విజయవడలోని షర్మిల ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. షర్మిలను బయటకు రాకుండా అడ్డగించారు. ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్టు చేశారు.
మే2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఉన్న నేపథ్యంలో ఉద్దండరాయునిపాలెంకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. అయినా పోలీసులను నెట్టుకుంటూ ఎలాగైనా ఉద్దండరాయునిపాలెంకు వెళ్లడం కోసం బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు ఆమెను ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. హౌస్ అరెస్టు చేసినా.. ఎలాగైన ఉద్దండరాయునిపాలెంకు వెళ్లి తీరుతానని షర్మిల చెప్పడంతో పోలీసుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి.
దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీ ప్రకటించి రెండు రోజులే అవుతుంది. ఇంకా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకుండానే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనలో మన రాజధాని కోసం ఏమి అడగాలి అనే విధివిధానల కోసం పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే ఎందుకు పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు? బయటకు వెళ్లనీకుండా ఎందుకు హౌస్ అరెస్టు చేశారు? నా రాజ్యాంగ హక్కులను ఎందుకు ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందంటూ పోలీసుల మీద షర్మిల మండిపడ్డారు.