మాది పెట్టుబడుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు;
తమది పెట్టుబడుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ లో పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.