గోదావరిలోకి వెళ్ళొద్దు
నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.;
ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉన్న రాష్ట్రల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 37.2 అడుగులుగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద ప్రస్తుతానికి ఇన్, ఔట్ ఫ్లో 2.9లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదల కారణంగా మరింత వరద నీటి ప్రవాహం గోదావరి నదిలోకి చేరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.
ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసర సహాయం కోసం, ఇతర సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థను సంప్రదించాలని తెలిపారు. దీని కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్టేట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోన్ నంబర్లు 112, 1070, 1800 425 0101కు సంప్రదించాలని కోరారు. వరద నీటి ప్రవాహం పెరిగుతున్న నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం,లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.