ప్రతిదాడి మాత్రమే చేశారంటున్న తల్లులు

మా పిల్లలు ఎవరిని చంపడానికి వెళ్లలేదు. వైయస్సార్సీపి అభ్యర్థి వాహనాన్ని ధ్వంసం చేయడం వల్ల ప్రతిదాడికి మాత్రమే వెళ్లారని కొందరు మహిళలు స్పష్టం చేశారు.

Update: 2024-05-19 04:00 GMT

తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి టిడిపి అభ్యర్థిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై దాడిలో పాల్గొన్న వారి తల్లులు కొందరు సంచలన విషయాలను వెల్లడించారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో వైయస్సార్సీపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్లను టిడిపి మద్దతుదారులు ధ్వంసం చేశారు. అందుకు ప్రతీకారంగా వాహనాలపై దాడి చేయడానికి వెళ్లారు తప్ప. ఎవరిని చంపాలనే ఉద్దేశం తమ పిల్లలకు లేదు’’ అని కొందరు తల్లులు స్పష్టం చేశారు. తమ కుమారులు పులివర్తి నాని వాహనాలపై ప్రతిదాడి చేశారే గాని ఏ ఒక్కరిపై హత్యాయత్నానికి పాల్పడలేదని.. తిరుపతి రూరల్ ప్రాంతం శ్రీరామాపురానికి చెందిన వైఎస్ఆర్‌సిపి మహిళా నాయకురాలు పుష్ప , ఢిల్లీ రాణి తదితరులు స్పష్టం చేశారు.

‘‘తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి హైవే మార్గంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలు ఏర్పాటుచేసిన చోట ఇటీవల జరిగిన పులివర్తి నాని పై దాడి, వాహనాల ధ్వంసం ఘటనలో తమ సంబంధీకులు ఐదుగురు మాత్రమే వాహనాలను ధ్వంసం చేయడానికి వెళ్ళారు. కానీ ఎవ్వరిని చంపడానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. టిడిపి వర్గీయులు కత్తులు తదితర ఆయుధాలతో ఉండడం పరిపాటి. అలాంటిది మా వాళ్లు కారులను ధ్వంసం చేయడానికే సమ్మెట(పెద్ద సుత్తి) ఎత్తుకెళ్లారు’’ అని చెప్పారు. ‘‘ఇది మాత్రమే వాస్తవం. దీనిని వక్రీకరించి మా పిల్లలు పులివర్తి నానిని చంపడానికి వెళ్లారని టిడిపి నాయకులు ఆరోపించడంలో వాస్తవం లేద’’ని వారు ఖండించారు. అనవసర నిందలు, ఆరోపణలు చేయడం సమంజసం కాదంటున్న ఆ తల్లులు.. దీనిపై తాము ఎంతవరకైనా వెళ్తామన్నారు. రెడ్డి సామాజిక వర్గం అంటేనే తమపై దాడులు చేస్తూ , కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు పై గ్రామాలలో విచారిస్తే పూర్తి విషయాలు అధికారులకే అర్థమవుతాయని తెలియజేశారు.

Tags:    

Similar News