తీరాన్ని దాటిందని అశ్రద్ధ వద్దు, పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం..

సచివాలయంలో మకాం వేసి సమీక్షిస్తున్న చంద్రబాబు

Update: 2025-10-28 18:04 GMT
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
తుపాను తీరాన్ని దాటిన తర్వాత పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచే సమీక్షిస్తున్నారు. ప్రాణహానీ లేకుండా జాగ్రత్తలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మొంథా’ తుపాను ప్రభావంపై అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలు దాటిన తర్వాత తుపాను అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది. అయినప్పటికీ మరో నాలుగైదు గంటలు పరిస్థితి బీభత్సంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పడంతో ఆయన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి ‘మొంథా’ ప్రభావంపై సమీక్ష చేపట్టారు. ఆర్టీజీ సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేస్తున్నారు. చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ ఉన్నారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుపాను సహయక చర్యలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో సీఎం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఏపీలోని తుపాను పరిస్థితిపై సీఎంకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్‌ చేసి మాట్లాడారు.
Tags:    

Similar News