TIRUMALA || టీటీడీలో అన్యమతస్తులు - నలుగురు ఉద్యోగులు సస్పెండ్..!
ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ;
అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. నాణ్యతా విభాగంలో డిప్యూటీ ఇంజినీర్గా పనిచేస్తున్న బీ.ఎలిజర్, బర్డ్ దవాఖానలో స్టాఫ్ నర్సు ఎస్.రోసి, గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జీ.అసుంతను సస్పెండ్ చేశారు. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని. అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు.
వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు