బెంగళూర్ తొక్కిసలాటపై కేఎస్సీఏ అధికారుల రాజీనామాలు
విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ వైరల్, ఘటన జరిగిన తరువాత లండన్ వెళ్లి పోయిన మాజీ కెప్టెన్;
Translated by : Praveen Chepyala
Update: 2025-06-07 08:30 GMT
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన వేడుకల సందర్భంగా బెంగళూర్ లో జరిగిన తొక్కిసలాట, 11 మంది మృతికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) కార్యదర్శి, కోశాధికారి ఏ శంకర్, ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను కేఎస్సీఏ అధ్యక్షుడికి సమర్పించినట్లు శంకర్, జైరాం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
కోహ్లీకి తగిలిన సెగ
బెంగళూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) బ్యాట్సెమెన్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ ఫిర్యాదుపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
ఒక అగ్రశ్రేణి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో ప్రజలు హజరుకావడంతో కోహ్లి, ఇతర క్రికెటర్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో తీవ్ర గందరగోళం, తొక్కిసలాట జరిగింది.
కన్నడ సంస్థ నైజా హోరతగారర వేదికేం సభ్యుడు, కార్యకర్త ఏఎం వెంకటేశ్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదును దాఖలు చేశారు. తొక్కిసలాటకు సంబంధించి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి.
కోహ్లిని అరెస్ట్ చేయాల్సిందే..
ఈ తొక్కిసలాట ఘటనకు కారణంగా ఆర్సీబీ యాజమాన్యమే కారణం కాకుండా, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కూడా లక్ష్యంగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ప్రజల ఆగ్రహం ఎలా ఉందంటే.. శుక్రవారం ఎక్స్ లో #అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
చాలామంది ఖాతాదారులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విషాదం జరిగిన తరువాత వెంటనే కోహ్లీ వెంటనే లండన్ వెళ్లిపోవడంతో చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం నుంచి ఆదేశాలు అందాయి..
బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు కారణంగా తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ స్పోర్ట్స్ లిమిటేడ్ మార్కెటింగ్ లిమిటేడ్ హెడ్ నిఖిల్ సోసలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
అర్థరాత్రి జరిగిన క్యాబినేట్ మీట్ తరువాత తన అరెస్ట్ కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక సూచనలు చేశారని, వాటి ఆధారంగానే తనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. సోసలే తన అరెస్ట్ ను రాజకీయ ప్రేరేపితం అని పేర్కొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం లపై కేసులు పెట్టండి: బీజేపీ
జూన్ 4 న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ. పరమేశ్వరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి పి. రాజీవ్ తెలిపారు.
‘‘అమాయకుల ప్రాణాలు పోవడానికి మొదటి కారణం సిద్దరామయ్య, రెండో కారకుడు డీకే శివకుమార్, వారు తమ రాజకీయ లబ్ధికి ఆర్సీబీ విజయాన్ని ఉపయోగించుకోవాలని, అధికారాన్ని దుర్వినియోగం చేశారు.
వారి కారణంగానే మరణాలు సంభవించాయి. ఇందులో హోంమంత్రి జీ పరమేశ్వర మూడో నిందితుడు. అతను తన విధుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. హోంమంత్రిగా విఫలమయ్యాడు’’ అని రాజీవ్ ఆరోపించారు.
ఆయన కబ్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తరువాత మీడియాతో మాట్లాడాడు. ఈ ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని అన్నారు.
‘‘నేను ఫిర్యాదు కాపీని ఏసీపీకి ఇచ్చాను. దానిని ఎఫ్ఐఆర్ గా మార్చాలి. లేకపోతే కోర్టుకు వెళ్లి పీసీఆర్ నమోదు చేస్తాను. పారదర్శకమైన చట్టప్రక్రియను నేను కోరుతున్నాను’’ అని ఆయన అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి దయానంద, మరో నలుగురు సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘ఆర్సీబీకి, ప్రభుత్వానికి మధ్య సంబంధం ఏంటీ?, ఆర్సీబీ విజయోత్సవాలకు ప్రజాధనం ఎందుకు ఖర్చు చేశారు’’ అని ఆయన ప్రశ్నించారు. ఆర్సీబీ విజయం తరువాత మంగళవారం రాత్రిపూట పోలీస్ సిబ్బంది రాత్రిపూట విధులు నిర్వహించారు.
నగరం మొత్తం రాత్రివేళలో వేడుకలు నిర్వహించారు. వారికి తగిన విశ్రాంతి ఇవ్వలేదు. బందోబస్త్ నిర్వహించలేమని పోలీసులు స్పష్టంగా చెప్పారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎం లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి బందోబస్త్ నిర్వహించాలని ఆదేశించారు.
పోలీసులు ఇచ్చిన నివేదికను తోసిపుచ్చి మరీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వారు వేడుకలు నిర్వహించారని రాజీవ్ ఆరోపించారు. భారీగా తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసే వ్యవస్థే అక్కడ లేకుండా పోయిందన్నారు. ‘‘భారీగా జనం గుమిగూడారు. ఇది నిర్లక్ష్యం తప్పమరొకటి కాదు’’ అని ఆయన విమర్శించారు.