పూరీలో తొక్కిసలాటపై సీఎం సీరియస్; కలెక్టర్, ఎస్పీ బదిలీ
మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల సస్పెన్షన్ ..;
పూరి(Puri) జగన్నాథ(Jagannath) రథయాత్రలో ఆదివారం జరిగిన తొక్కిసలాట(stampede)లో ముగ్గురు భక్తులు మరణించారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రథయాత్రలో భాగంగా గుండీచా ఆలయం దగ్గర తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతులనులాగర్కు చెందిన బసంతి సాహు(36), బలిపట్నానికి చెందిన ప్రేమకాంత్ మొహంతి(80), ప్రవతి దాస్ (42)గా గుర్తించారు.
ఈ దుర్ఘటనతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ వినీత్ అగర్వాల్ను బదిలీ చేయాలని, మరో ఇద్దరు పోలీసు అధికారులు డీసీపీ బిష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధిని సస్పెన్షన్లో ఉంచాలని సీఎం ఆదేశించారు.
దర్శనం కోసం రావడంతోనే..
‘‘రథయాత్ర ముగిసిన తర్వాత శనివారం జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు గుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దర్శనం కోసం అందరూ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.’’ అని కలెక్టర్ సిద్ధార్థ్ వెల్లడించారు.