జొమాటో కొత్త వ్యూహం- కస్టమర్లపై భారం
నష్టాల్ని తగ్గించుకునే పేరిట ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) యూజర్లపై చార్జీల భారం మోపనుంది.;
By : The Federal
Update: 2025-05-23 09:16 GMT
Zomato.. జొమాటో.. గట్టి బాదుడే బాదుతోంది. ఇల్లు కదలకుండా ఫుడ్ తెప్పించుకోవాలనుకునే పాలిట ఇదో పెద్ద భారమే కానుంది. నష్టాల్ని తగ్గించుకునే పేరిట ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) యూజర్లపై చార్జీల భారం మోపనుంది. దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించింది. ‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు’ను ప్రారంభించింది. అంటే ఇకపై దూరంగా ఉన్న హోటల్/రెస్టరంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ మేరకు ఛార్జీలు ఉండబోతున్నాయి.
4 కిలోమీటర్ల లోపల ఉంటే ఒక రేటు, అది దాటితే అదనపు రేటు ఉండనుంది.
ప్రస్తుతం వినియోగదారులు 4 నుంచి 6 కిలోమీటర్ల మధ్య ఉంటూ ఆర్డర్ విలువ రూ.150 దాటితే కస్టమర్ల నుంచి రూ.15 వసూలు చేస్తున్నారు. అదే 6 కిలోమీటర్ల పరిధి దాటితే ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా నగరాన్ని బట్టి సర్వీస్ ఛార్జి రూ.25 నుంచి రూ.35 వరకు ఉంటుంది.
కొవిడ్ విజృంభణకు ముందు జొమాటో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న దూరానికి ఎలాంటి ఛార్జీలు విధించేది కాదు. కోవిడ్ తర్వాత అనేక రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడిన సమయంలో ఆ డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. డెలివరీ ఫీజును మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలుచేయాలని నిర్ణయించింది. అయితే, డిస్టెన్స్ ఛార్జీ, సర్వీసు ఛార్జీ ఆర్డర్ విలువకు 30 శాతం మించకుండా చూసుకోవాలని రెస్టరంట్ పార్టనర్లకు జొమాటో సూచించింది. 150 రూపాయల విలువైన ఆహార పదార్థాలు ఆర్డరు చేస్తే 45 నుంచి 50 రూపాయలు డెలివరీ ఫీజు ఉండనుంది.
జొమాటో ఇటీవల నష్టాల బాటలో ఉంది. తన క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్పై పెద్దఎత్తున ఖర్చు చేస్తోంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్లాట్ఫామ్ ఫీజును వసూలుచేస్తున్న ఈ కంపెనీ తాజాగా.. జొమాటో గోల్డ్ చందాదారులకు రెయిన్ సర్ఛార్జీ మినహాయింపును తొలగించింది.