శిశుపాలుడులా చంద్రబాబు పాపాలు చేస్తున్నారు

వైసీపీ నేత ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోందని జగన్‌ మండిపడ్డారు.;

Update: 2025-05-23 15:15 GMT

సీఎం చంద్రబాబు పాలన మీద, పల్నాడు జిల్లా పోలీసుల మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శిశుపాలుడి మాదిరిగా సీఎం చంద్రబాబు పాపాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నేత కుమారుడు మీద పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు.

జగన్‌ ఏమన్నారంటే..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడటం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాని వీరికి ఎవరు ఇచ్చారు? థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేంకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్‌లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండదండలతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? సీఎం చంద్రబాబు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంత వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం అంటూ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హరికృష్ణకు సంబంధించిన వీడియోను జత చేసి షేర్‌ చేశారు.


Tags:    

Similar News