కారులోనే ఇరుక్కుని ఆరుగురు మృతి

ఈ దుర్ఘటనమీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;

Update: 2025-05-23 10:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు కారులోనే పోయాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం సమయంలో లారీ, కార్లు ఢీకొట్టుకోవడంతో ఈ దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న మృతులను బాపట్ల జిల్లా స్టువర్టుపురంకు చెందిన వాసులుగా గుర్తించారు. మహానంది పుణ్యక్షేత్రంలో దేవుని దర్శనం కోసం వెళ్లి స్టువర్టుపురంకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన సమయంలో ఎనిమిది మంది వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాని చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టతరంగా మారింది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహానంది దైవదర్శనానికి వెళ్లి తిరిగి స్టూవర్టుపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం, ఆరుగురు వ్యక్తులు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రం నుంచి ఇంటికెళ్లే సమయంలో ఇలాంటి దారుణం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్తాన్ని వైఎస్‌ జగన్‌ కోరారు.
Tags:    

Similar News