మామిడి తగువుకు మంత్రి అచ్చెన్న ఏ మంత్రం వేస్తారు?

మామిడికి మద్దతు ధర చిక్కుముడి పడింది. ఆంక్షలపై కర్ణాటక ప్రభుత్వం కన్నెర్ర చేసింది. చిత్తూరుకు వస్తున్న వ్యవసాయ శాఖా మంత్రి ఈ తగువు ఎలా తీరుస్తారు?;

Update: 2025-06-14 04:27 GMT

తోతాపురి మామిడి కాయల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు అమరావతిని తాకాయి. సీఎం ఎన్. చంద్రబాబు సొంత జిల్లా కావడం. చిత్తూరులో పొరుగు రాష్ట్రాల దిగుబడి కొనకూడదనే ఆంక్షలు చిచ్చు రగిల్చాయి. కర్నాటక ప్రభుత్వం లేఖల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు (శనివారం) చిత్తూరు పర్యటనకు రానున్నారు.

చిత్తూరులో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో మంత్రి అచ్చన్నాయుడు చర్చించనున్నారు. ధరల విషయంలో కూడా చర్చించేందుకు రంగంలోకి దిగుతున్నారు. కొన్ని పరిశ్రమలను కూడా పరిశీలించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
దీని వెనుక కథేమిటంటే..
చిత్తూరు జిల్లాలో దిగుబడి చేసే 1.10 లక్షల హెక్టార్లలోని మామిడి తోటల నుంచి వచ్చే దిగుబడి మాత్రమే గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుబడి రాకుండా ఆంక్షలు విధించింది.
రైతు సంఘాల నేతల్లో కొందరు చేసిన రాద్దాంతం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందనేది సమాచారం. పరిశ్రమల యజమానులను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ ఎవరికి నష్టం జరగకుండా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలో మామిడికి రూ. 12 మద్దతు ధర ప్రకటించడం ద్వారా సమస్యను సున్నితంగా పరిష్కరించారు. అయితే, ఈ ధరకు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.
"చిత్తూరు జిల్లాలో దిగుబడి అవుతున్న మామిడి కాయలు మాత్రమే కొనాలి. కర్ణాటక నుంచి మామిడి కాయలు తీసుకురానివ్వండి జాగ్రత్తలు తీసుకోండి" అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా,
చిత్తూరుకు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సరిహద్దులతో పాటు చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ అధికారులను కాపలా ఉంచారు. ఈ వ్యవహారంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది.
చిత్తూరులో విధించిన ఆంక్షల వల్ల పొరుగు రాష్ట్రంతో దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక, రాజకీయ సంబంధాలతో పాటు వ్యాపార లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మొదట లేఖలతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తున్న సిద్ధరామయ్య వారి రాష్ట్ర రైతులను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం ఎన్. చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
"ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. కర్ణాటక మామిడి దిగుబడిపై విధించిన ఆంక్షలు ఎత్తివేయండి" అని సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక చీఫ్ సెక్రటరీ డాక్టర్ శాలిని రజనీష్ వేర్వేరుగా లేఖల ద్వారా ఒత్తిడి పెంచారు.
"రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలి. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించకూడదు. భావోద్వేగాలు రెచ్చగొట్టకూడదు" అని అర్థం వచ్చే విధంగా రాసిన లేఖలు ఏపీ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి.
రంగంలోకి అచ్చెన్న
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని పరిణామాలు ఎదురుకావడంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కే. అచ్చన్నాయుడు ఇంకొన్ని గంటల్లో చిత్తూరు పర్యటనకు రానున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ విషయం తెలిపారు.మంత్రి అచ్చన్నాయుడు మధ్యాహ్నం 12.45 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. రెండు గం.లకు గుడిపాల మండలం పల్లూరులోని ఫూడ్స్ అండ్ ఇన్స్ మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమ వద్దకు వెళ్లి, గుజ్జు పరిశ్రమల యజమానులు, రైతులతో స్వయంగా మాట్లాడతారు. మూడు గంటలకు మంగసముద్రం మార్కెట్ యార్డ్ చేరుకుని మామిడి రైతులు, పండ్ల గుజ్జు పరిశ్రమ ప్రతినిధులతో ముఖాముఖీ నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత మంత్రి అచ్చన్నాయుడు చిత్తూరు నుంచి బయలుదేరి తిరుమలకు వెళతారు.
ధరపైనే చర్చ
తోతాపురి మామిడి పండ్లకు ఈ సీజన్ లో మద్దతు ధర ప్రకటించారు. కిలో రూ.12కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రూ. 4 ప్రభుత్వం చెల్లిస్తే, రూ. 8 గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు చెల్లించాలనేది నిర్ణయం. దీనిపై పీటముడి ఏర్పడింది. ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయడానికి పరిశ్రమల యజమానులు ససేమిరా అంటున్నారు. బహిరంగ మార్కెట్ లో కిలో ఐదు ఉంటే, ఎనిమిది రూపాయలు ఎలా చెల్లించగలం? నాలుగుకు మించి ఇవ్వలేమని అంటున్నారు. దీంతో..
"రైతులు తీసుకుని వచ్చే దిగుబడి తీసుకోండి. మిగతా వివరాలు తరువాత మాట్లాడదాం" అని అధికారులు సర్ది చెప్పడానికి లోపాయికారీగా సముదాయించారని సమాచారం. కాగా, ఈ విషయంతో పాటు కర్ణాటక నుంచి దిగుబడి కొనుగోలు చేయరాదనే ఆంక్షలు ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చన్నాయుడు రంగంలోకి దిగారు. ఈ రెండు సమస్యలపై మామిడి గుజ్జు పరిశ్రమలు, రైతుల మధ్య ఎలాంటి సయోధ్య కుదురుస్తారనేది వేచిచూడాలి.

Similar News