ఏపీహెచ్ఎంఈఎల్ను అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పర్యటించారు.;
ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎదగాలని, ఆ విధంగా దీనిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ను సింగరేణి సిఎండి బలరాంతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు ఏపీహెచ్ఎంఈఎల్ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని, మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని, వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చు అని తెలిపారు.
సంస్థను, ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలి, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్ కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మత్తు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకొని బీహెచ్ఈఎల్ మాదిరిగా సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ పని చేస్తుందని, థర్మల్ పవర్ స్టేషన్స్కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మతులు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో దీనిని అన్ని విదాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.