ఆ రెండు నియోజక వర్గాలు చేజారకూడదనే..

ఆ రెండు నియోజక వర్గాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ ఘన విజయం సాధించింది.

Update: 2024-07-27 10:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు నియోజక వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోను తమ చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి పోకూడదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఈ పరిస్థితి కొనసాగాల్సిందే. అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్టుదల. గత ఎన్నికల్లో పట్టు సడలకుండా ఆ రెండు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లకు దేశ ప్రజలంతా వారి వైపు చూసేలా చేశాయి. కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలో చంద్రబాబు గత 30ఏళ్లకుపైగా రాజకీయాలు నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సారి కుప్పం నుంచి శాసన సభకు పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి అక్కడ ఆయన జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆయన చర్మిష్మాను కాస్త తగ్గించాలని నాటి సీఎం జగన్, ఆయన పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేశారు. అందుకోసం ముందుగా స్థానిక మునిసిపల్‌ ఎన్నికల్లో చైర్మన్, వార్డు సభ్యులను గెలిపించుకొని మెజారిటీ సాధించి వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్‌ పదవిని దక్కించుకుంది. నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లోనూ ఎక్కువ మంది సర్పంచ్‌లుగా వైఎస్‌ఆర్‌సీపీ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ బలంతో చంద్రబాబు మెజారిటీని సింగిల్‌ డిజిట్‌కు తీసుకొని రావాలని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే అది సాధ్యం కాలేదు.
గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబునాయుడు కూడా అప్పట్లో ఇంటింటి ప్రచారం చేశారు. భార్య భువనేశ్వరి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో నారా లోకేష్‌ 2019లో ఓడిన నాటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. యువత, నిరుద్యోగులు, మహిళలు, క్రీడాకారులు, స్వయం ఉపాధి చేసుకునే స్త్రీలకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేసి తమ వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. 52వేల మెజారిటీతో గెలుస్తానని ఒక బహిరంగ సభలో తండ్రి చంద్రబాబుకు హామీ ఇచ్చిన లోకేష్‌ అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపించారు. ఇదంతా ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం.
ఇప్పుడేమి జరుగుతోంది..
అటు కుప్పంలో కానీ ఇటు మంగళగిరిలో కానీ ఎప్పటికీ ప్రజలు తమను దూరం చేయకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. గెలవగానే కుప్పం నియోజక వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వెళ్లి అక్కడి ఓటర్లను కృతజ్ఞతలు తెలిపారు. మేము ఎల్లపుడూ మీతోనే ఉంటామనే భరోసా ఇచ్చారు. మీరు చూపించిన ఆదరాభిమానాలను మరువలేమన్నారు. అలాగే మంగళగిరిలోను లోకేష్‌ సందపతులు పర్యటించారు. ఓటర్లను కలిసారు. ప్రజా దర్బార్‌ పేరుతో లోకేషన్‌ తన ఇంటి వద్దనే నియోజవర్గంలోని వారి నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని వారినే కాకుండా రాష్ట్రంలోని ప్రజలు ఎవరు వచ్చినా కాదనకుండా అర్జీలు తీసుకుంటున్నారు. చాలా మందికి స్వయం ఉపాధి పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. కొందరికి టెక్నికల్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. ఆ కోర్సుల ద్వారా వారు ఉపాధి పొందే విధంగా లోకేష్‌ కావాల్సిన వసతులు కల్పించారు.
కుప్పంలో ఒక్కో వర్గానికి ఏమి కావాలో గుర్తించే బాధ్యత నారా భువనేశ్వరి తీసుకున్నారు. ఆమె ఇటీవల నియోజకవర్గంలోని ముఖ్యమైన గ్రామాల్లో పర్యటన మొదలు పెట్టారు. వెళ్లిన ప్రతి చోటా మీకు ఏదో ఒకటి చేయాల్సి ఉందని, మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీకు మావంతు సాయం చేయాలంటూ వారి కోర్కెలు విని నోట్‌ చేసుకుంటున్నారు. అందరికీ జీవనోపాది కల్పించే మార్గాలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో భువనేశ్వరి నిమగ్నమయ్యారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రాజకీయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భార్య నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం చూపుతున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుందని, గతంలో కంటే ఎక్కువ మంది అభిమానులు చంద్రబాబు కుటుంబానికి తోడయ్యారని పలువురు చెబుతున్నారు. మంగళగిరిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వారు పిలిస్తే వెళ్లేందుకు లోకేష్‌ వెనుకాడటం లేదు.
Tags:    

Similar News