ఆ వ్యాఖ్యలు కిరాతకమైనవి - వెంకయ్యనాయుడు
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.;
By : The Federal
Update: 2025-06-09 05:59 GMT
అమరావతి మహిళలపైన కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్టు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని గత రెండు రోజులుగా అమరావతి మహిళలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. అమరావతి ప్రాంతపు మహిళలమీద, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల మీద నోళ్లు పారేసుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు వెంకయ్యనాయుడు సోమవారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకయ్యనాయుడు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివి. కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ... భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. అంటూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 9, 2025
ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి. సభ్యసమాజం సహించలేనివి. కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర…