తిరుమల శేషాచలం అటవీప్రాంతం ఓ జీవవైవిద్య కేంద్రం. అరుదైన జంతువులతో పాటు అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. తిరుమల జీఎన్సీ టోల్ గేటుకు సమీపంలో మరో దివ్య ఔషధవనం ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన కొండలకు ఇది మరో మణిహారంగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ సిద్ధం చేశదారు. నూతన సంవత్సరం జనవరిలో ప్రారంభించే పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. సంప్రదాయ వనంలో ఆయుర్వేద చికిత్సకు అవసరమైన మొక్కల తో పాటు అధ్యయనం ద్వారా విజ్ణానం పంచే విధంగా దివ్య ఔషధవనం ఏర్పాటు చేయనున్నారు.
సాంప్రదాయ వైద్యానికి జీవం
భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవనాడిగా దివ్య ఔషధ వనం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
"అంతరిస్తున్న దశలో ఉన్న అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించింది"
అని టీటీడీ ఈఓ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ, ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అని ఆయన చెప్పారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పాటు అందించడమే కాకుండా, దక్షిణ భారతదేశంలోనే ఈ తరహాలో రూపొందనున్న ఈ ఔషధ వనంయాత్రికులు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఆయన వివరించారు.
భక్తి–విజ్ఞానం–ప్రకృతి సమ్మేళనం
టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధవనం భక్తితో పాటు విజ్ఞానం పంచే ప్రకృతి సమ్మేళనంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
"మనుషులకు అవసరమైన చికిత్సకు అవసరమైన మొక్కలతో వనం ఉంటుంది. సుగంధ వనం, పవిత్రవనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతువనం, విశిష్ట వృక్ష వనాలు" ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ వనాల్లో ఔషధ మొక్కలతో కూడిన 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.
3.90 ఎకరాల్లో రూ.4.25 కోట్లతో ఏర్పాటు
తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
2026 జనవరి నెలలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ మొక్కలు పెంచి, యాత్రికుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. డిసెంబర్చి చివరికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది.