ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి: చంద్రబాబు
గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటు పడింది, మన ప్రభుత్వంలో అభివృద్ధిని చేసి చూపించాం.;
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అన్నీ చేసేశామని చెప్పట్లేదని.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఏడాది పాలనపై సోమవారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీఎం పదవి తనకు కొత్తకాదు
సీఎం పదవి తనకు కొత్తకాదని నాలుగు సార్లు సీఎం అయ్యానని గుర్తుచేశారు. మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. సమావేశం ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.
మూడు రాజధానుల ప్రకటనతో అభివృద్ధి కుంటు పడింది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య తీరుతుందన్నారు. అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు పెట్టానని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం చేశామని చెప్పారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పూర్తి చేస్తామని మాటిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్కు రూ.12,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. విశాఖపట్నం రైల్వేజోన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. తల్లికి వందనం హామీని పూర్తిగా నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సంపద సృష్టిస్తేనే ఖర్చు చేసే హక్కు
పోలవరం ప్రాజెక్టు పూర్తైతే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఏపీకి చాలా వరకు నీటి సమస్య తీరుతుంది. దక్షిణ భారతదేశంలో నీటి సౌలభ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని సీఎం చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసింది. రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానాన్ని కలిగించారు.
ఎక్కడ చూసినా వేధింపులు, అణగదొక్కే దోరణిలే కనిపించాయని అన్నారు. పాలన ప్రజల కోసం చేయాలన్న ఆలోచనే కూడా నాటి పాలకులు చేయలేదు. ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అర్హత ఉంటుందన్నారు. ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని ప్రశ్నించారు. ఆదాయాన్ని పెంచుకుని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు
‘గోదావరి-బనకచర్ల’ ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా.. తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని సీఎం అన్నారు.
వృద్ధి రేటులో అనూహ్య పెరుగుదల
2024-25 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీలో 12.02 శాతం వృద్ధి రేటు సాధించి రూ.15.93 లక్షల కోట్లు నమోదు చేశాం. ఇదే సమయానికి దేశంలో వృద్ధి 9.8 శాతమే ఉంది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో సగటు వృద్ధి 13.49 శాతం సాధించామని సీఎం చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సగటున 10.32 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పడిపోవడంతో రూ.76,195 కోట్లు నష్ట పోయామన్నారు. 2024-25లో వ్యవసాయరంగంలో 15.41 శాతం, పరిశ్రమల రంగంలో 6.41 శాతం, సేవల రంగంలో 11.82 శాతం నమోదు చేశాం.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం 11.89 శాతం పెరిగింది. రూ.2,37,951 నుంచి రూ.2,66,240కు పెంచగలిగాం. 2029 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.29.29 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.5.42 లక్షలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.308 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.55 లక్షలు నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మైక్రో-మాక్రో విజన్ ప్లానింగ్ అమలు చేస్తున్నాం. పొలిటికల్ గవర్నెన్స్ అనుసరిస్తున్నామని అన్నారు.
అంతర్జాతీయ యోగాడే సక్సెస్ చేసిన వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం సన్మానించారు. లోకేష్ నేతృత్వంలో యోగా డే కోసం ఏర్పడిన కెబినెట్ సబ్ కమిటీలోని మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు.