TDP Mahanadu |40 వేల మంది ప్రతినిధులకు 'సీమ' రుచుల వంటకాలు

కడప టిడిపి మహానాడులో నోరూరించే పదార్థాలు వడ్డించనున్నారు. 22 రకాల వంటలు వండడానికి 1500 మంది పనిచేయనున్నారు ఈ ఏర్పాట్లపై టిడిపి నేతలు సమీక్షిస్తున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-24 12:01 GMT
కడప: చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద టీడీపీ మహానాడు ప్రతినిధుల కోసం సిద్ధం చేసిన వేదిక

కడపలో టీడీపీ మహానాడు నిర్వహణకు గడువు సమీపిస్తోంది. పార్టీ సీనియర్లు, మంత్రులు నగరంలో మకాం వేశారు. రోజుకు 40 వేల మందికి 22 రకాలతో అల్పాహారం, శాఖాహార భోజనాలు వడ్డించనున్నారు. దీనికోసం పాకశాస్ర్త నిపుణుల సారధ్యంలో దాదాపు 1,500 మంది వంటవాళ్లు రంగంలోకి దిగనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు నగరంతో పాటు శివారు, సమీప పట్టణాల్లో కూడా వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు కడపకు సమీపంలో కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లి-పబ్బాపురం గ్రామాల మధ్య 250 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, పార్టీ కార్యవర్గ సభ్యులు కూర్చునే వేదికతో పాటు ప్రతినిధుల కోసం కలిపి ఒక షడ్ ఏర్పాటు చేశారు చేశారు. అల్పాహారం, భోజనం, విశ్రాంతి, మంచినీరు, వైద్య బృందాలకు ప్రాంగణంలోని వేరువేరుగా ప్రత్యేక వసతులతో ఏర్పాటు చేస్తున్నారు.

రాయలసీమలో ప్రధానంగా కడప జిల్లా ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబానికి అడ్డగా ఉంది. ఇలాంటి కేంద్రంలో మహానాడు నిర్వహించడం ద్వారా గట్టి సవాల్ విసరడానికి టిడిపి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులురెడ్డి ఏమన్నారంటే..
"కడపలో మూడు రోజుల మహానాడుకు ఏర్పాట్లు చేశాం. మొదటి రోజు 40 వేల మంది అతిథులు హాజరవుతారు" అని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కడపలో నిర్వహించే మహానాడులో 23 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. వారందరికీ ఉదయం అల్పాహారంలో టీ, కాఫీ తో పాటు ఎనిమిది రకాల రుచులతో వడ్డించనున్నారు. మధ్యాహ్నం 22 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సారధ్యంలో ఏర్పాటు చేసిన భోజనాలు కమిటీ కడపలో శనివారం భేటీ అయింది. మహానాడుకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు వడ్డించాల్సిన ఆహార పదార్థాలు, ప్రతినిధుల ప్రాంగణంలో ఫుడ్ కోర్టులు ఎన్ని ఏర్పాటు చేయాలని అంశాలపై చర్చించారు.
ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడారు.
"ప్రతినిధులకు శాఖాహార వంటకాలు వడ్డించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర పార్టీ కార్యాలయం దీనిని పర్యవేక్షిస్తోంది" అని గిరిధర్ రెడ్డి చెప్పారు. ఈరోజు రాత్రికి ఈ అంశంలో క్లారిటీ వస్తుంది అని ఆయన తెలిపారు. క్యాటరింగ్ విజయవాడ ప్రాంతానికి చెందిన వారికి అప్పగించే అవకాశం ఉంది.
మహానాడు ప్రాంగణంలో అల్పాహారం, భోజన వసతి కల్పించడానికి సుమారు ఆరు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతినిధులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలోనే నాయకులకు టోకెన్లు జారీ చేస్తారు. ఆ టోకెన్లతో నచ్చిన ఫుడ్ కోర్టులో కోరిన ఆహార పదార్థాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అల్పాహారంలో వంటకాలు
రాయలసీమలో తిరుపతి తర్వాత కడపలో మొదటిసారి టిడిపి మహానాడు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర వంటకాలతో పాటు రాయలసీమ రుచులతో వంటకాలు వడ్డించనున్నారు.
కడపలో ఈనెల 27వ తేదీ ప్రారంభమయే టిడిపి మహానాడుకు 40 వేల మంది ప్రతినిధులకు హాజరయ్యే వారికి అల్పాహారం, భోజన వసతి కల్పించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం అల్పాహారం : కడప మహానాడులో ప్రతినిధులకు ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, వడ, పొంగల్, విభిన్న రకాల చట్నీలు, సాంబార్, కారప్పొడి, నెయ్యి వడ్డించనున్నారు. ఆ తర్వాత టీ, కాఫీ కూడా అందించడానికి ఏర్పాటు చేయనున్నారు.
మధ్యాహ్న భోజనం: కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జి, బగారా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతి, సొరకాయ పప్పు, చెట్ని, కారంపొడి, తెల్లా అన్నం,
కూరలు: భోజనం లోకి జీడిపప్పుతో కలిపిన టమాట ములక్కాయ, అప్పడాలు, గుత్తి వంకాయ, ఉలవచారు, రసం, పెరుగు, కేక్, కూల్ డ్రింక్ తో పాటు పాన్ (తాంబూలం) అందుబాటులో ఉంచనున్నారు. మధ్యాహ్నం భోజనంలో కాజు చికెన్ కర్రీ, ఎగ్ మసాలా తో కూడిన 22 రకాల వంటకాలు వడ్డించరున్నారు.
టిడిపి ఎన్నారై సెల్ జర్మనీ విభాగం ఈ ఏర్పాటును పరివేక్షిస్తున్నట్లు టిడిపి సీనియర్ నాయకుల ద్వారా తెలిసింది. గతంలో శాఖాహారానికి పరిమితమైన వంటకాలలో రెండు నాన్ వెజ్ పదార్థాలను కూడా చేర్చింది. కడపలో జరిగే మహానాడులో కూడా మెనూ మార్పు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
విజయవాడ నుంచి క్యాటరింగ్?
కడపలో నిర్వహించే మహానాడుకు కూడా విజయవాడకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ప్రతినిధికే కాంట్రాక్టు అప్పగించినట్లు తెలుస్తోంది.
2023 రాజమండ్రిలో నిర్వహించిన టిడిపి మహానాడుకు అంబికా కేటరింగ్ ప్రతినిధులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 50 వేల మందికి రుచికరమైన, నోరు గురించే వంటకాలను వడ్డించారు.
మహానాడుకు హాజరైన ప్రతినిధులు, పోలీస్ శాఖతోపాటు వివిధ విభాగాల సిబ్బంది, వాలంటీర్లకు కూడా ఆహార పదార్థాలను తయారు చేయడానికి 1500 మంది వంటవాళ్లు పనిచేశారు. వారంతా 2 వంటకాలను నిధుల కోసం సిద్ధం చేశారు. మహాసభలో శనివారం కావడంతో అల్పాహారంలో ఇడ్లీ, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు వడ్డించారు. ఇవన్నీ ఆ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు. ఫుడ్ కోర్టుల వద్ద 10 లక్షల వాటర్ బాటిళ్లు, మరో 10 లక్షలు వాటర్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు.
మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు వెజ్ బిర్యానీ, బెండకాయ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, టమాటా మునక్కాడ, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై, బంగాళాదుంప, khurma, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మామిడి ఆవకాయ, దోస ఆవకాయ, సాంబార్, మజ్జిగ పులుసు, పెరుగు, కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబి కూడా వడ్డించడానికి రాజమండ్రి నుంచి కీలకంగా వ్యవహరించిన టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షించారు.
2016లో తిరుపతిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో వంటకాలు వడ్డించారు. 30 రకాల వంటకాలు తయారు చేయడానికి పాకశాస్త్ర నిపుణులను ప్రత్యేకంగా రప్పించారు. ఏర్పాట్లను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పర్యవేక్షించారు. శనివారం మినహా మిగతా రెండు రోజులు మాంసాహారం వంటకాలను కూడా వడ్డించారు.
కడప వెలుపల కూడా వసతి
మహానాడుకు హాజరయ్యే వారికి కడప పట్టణంలో వసతి సరిపోవడం లేదు. దీంతో కడప నగరంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ సీనియర్ నాయకులకు ప్రైవేట్ హోటల్లులో వస్తే కల్పించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి కల్పించడం ఇబ్బంది కరంగా మారింది. అందువల్ల జిల్లాలోని సమీప ప్రాంతాలు మైదుకూరు, పొద్దుటూరు, పులివెందులతో సహా గ్రామాలలో కూడా పార్టీ ప్రతినిధులు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా వసతి ఏర్పాటు చేశారు.
"నగరంలో అందరికీ వసతి కష్టం కావడం వల్ల ఈ ఏర్పాట్లు చేశాం"అని టిడిపి నాయకుడు ఒకరు చెప్పారు. సమీప గ్రామాల్లోని ఇళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు.

Similar News