SVIMS | ఏఐ ఆధారిత వైద్యం అందించేందుకు అడుగులు...
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-11 12:59 GMT
పేదలకు కార్పొరేట్ తరహాలో అధునాతన వైద్య సేవల కోసం టీటీడీ ఆధీనంలోని స్విమ్స్ ( Sri Venkateswara Institute of Medical Sciences) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. త్వరలో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఆధారిత వైద్య సేవలు, రోబోటిక్ ఆపరేషన్లు, క్యూ లేకుండా ఆన్లైన్ బుకింగ్ ఓపిడి. సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం బుధవారం మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన 501 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 40 మందికి బంగారు పతకాలు, ఇద్దరికి మెరిట్ సర్టిఫికెట్లు మరో ఇద్దరికి నగదు పురస్కరాలను అందజేశారు.
శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన టీటీడీ చైర్మన్, ఛాన్స్ లర్ ఆఫ్ స్విమ్స్ యూనివర్శిటీ బిఆర్.నాయుడు మాట్లాడుతూ, స్విమ్స్ ను ప్రపంచంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"1993లో మాజీ సీఎం ఎన్టీరామారావు స్విమ్స్య ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 30 ఏళ్ల ప్రస్థానంలో రాయలసీమ ప్రజలతో పాటు రాష్ట్రంలోని రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోంది. దేశంలో రెండో మహిళా వైద్య కళాశాలగా శ్రీపద్మావతి మెడికల్ కాలేజీ గుర్తింపు సాధించింది. ఇక్కడి నుంచి 175 మంది మహిళా వైద్యులు తయారవుతున్నారు" అని బీఆర్. నాయుడు చెప్పారు. స్విమ్స్ కు టిటిడి 60 కోట్లు గ్రాంటు అందిస్తుండగా ప్రాణదాన ట్రస్టు క్రింద మరో 24 కోట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఆధునిక వసతులు
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. దాదాపు రూ. 600 కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని అందులో క్యాన్సర్ బ్లాక్, కార్డియో న్యూరో బ్లాక్ స్పెషాలిటీ బ్లాక్, సెంట్రల్ కిచెన్, సెంట్రల్ గోడౌన్, స్టాఫ్ క్వార్టర్స్, రోగుల సహాయకులకు వసతి కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
స్విమ్స్ అభివృద్ధికి విశ్రాంత ఐఏఎస్. అధికారి ఐవి. సుబ్బారావు కమిటీ సూచనల మేరకు అదనంగా రూ. 71 కోట్ల నిధులు ఇస్తామన్నారు. ఇక్కడ 550 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్లను త్వరలో రిక్రూట్ చేస్తామని వివరించారు.
ముఖ్యఅతిథి డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, స్విమ్స్ తో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందనీ, శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఎయిమ్స్ సిఈ.ఓగా నాగపూర్ ఎయిమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్ కావడానికి దోహదపడ్డాయన్నారు. అంతకుముందు స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్.వి. కుమార్ యూనివర్శిటీ నివేదికను సమర్పించారు.
స్విమ్స్ రాయలసీమ ప్రాంతం వారికి శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదించిన వరం అని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో స్విమ్స్ అభివృద్ధి చెందుతోందన్నారు. స్విమ్స్ యూనివర్శిటీ అందిస్తున్న వైద్య విద్యకు అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎన్. సదాశివరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తోపాటు స్విమ్స్ లోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.