మండలిలో ఆరు బిల్లులకు ఆమోదం–నివధిక వాయిదా
భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లుతో పాటు పలు కీలక బిల్లులకు ఏపీ శాసన మండలి ఆమోదం తెలిపింది.
By : The Federal
Update: 2025-09-27 11:40 GMT
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శనివారం సమావేశంలో ఆరు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. న్యాయవిద్య, పరిశోధనల కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్సిటీ స్థాపనకు ప్రభుత్వం తీసుకొచ్చిన అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లు–2025 బిల్లును మండలి ఆమోదించింది. అంతేకాకుండా, ఏపీ ప్రైవేటు వర్సిటీల (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2025, ఏపీ వర్సిటీల సవరణ బిల్లు–2025లకు కూడా మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్శిటీలను నియంత్రించేందుకు, నాణ్యత మెరుగుపరచేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లులను ఆమోదించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ‘కుష్టువ్యాధి‘ అనే పదాన్ని చట్టాల నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది.
ఆమోదించిన ఇతర బిల్లులు
ఏపీ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్ట సవరణ బిల్లు – 2006, ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీకరణ బిల్లు – 2025, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయిని డిప్యూటీ కలెక్టర్గా నియమించే ప్రతిపాదనపై చట్టసవరణ బిల్లు, ఏపీ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు – 2025
ఈ బిల్లులన్నీ శాసనమండలిలో విపక్షాల ఆక్షేపణల మధ్య ఆమోదం పొందాయి. ప్రత్యేకించి, క్రీడా ప్రోత్సాహం కోణంలో సాకేత్ సాయికు ఉద్యోగావకాశం కల్పించే బిల్లు చర్చకు దారితీసింది.
నివధిక వాయిదా
బిల్లుల ఆమోదానంతరం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు శాసన మండలిని నివధిక వాయిదా వేశారు. తాజా సమావేశాల్లో కీలక చట్టాలపై చర్చ జరగడం, కొన్ని బిల్లులపై వాగ్వాదం చోటుచేసుకోవడం గమనార్హం.