‘నాలా’ చట్టం రద్దు ఆహార భద్రతకు ముప్పు

రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ;

Update: 2025-06-16 07:49 GMT
EAS Sarma, IAS

రాష్ట్ర ప్రభుత్వం నాలా చట్టం రద్దు చేయడం వలన, చిన్నకారు రైతుల జీవనోపాధికి నష్టం కలగడమే కాకుండా, రాష్ట్ర ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయడం అవుతుంది. అటువంటి నిర్ణయం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం.

రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కు కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కోరుతూ సోమవారం లేఖ రాశారు. ఈ ప్రతిని ‘ది ఫెడరల్’ కు పంపించారు.

K విజయానంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. రాష్ట్రంలో పనిచేసే చిన్నకారు ప్రజలు, ముఖ్యంగా SC/ST/OBC ప్రజలు, 60% కి పైగా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. మన రాష్ట్ర ఉత్పత్తి (GDP) లో 33% కి పైగా వ్యవసాయ కార్యకలాపాల మీద ఆధారపడి ఉంది. అటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తించాలి.

గత రెండు మూడు దశాబ్దాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా, పెద్ద ఎత్తున సాగులో ఉన్న భూములు, పరిశ్రమల కోసం, ఇతర ప్రయోజనాల కోసం తరలింపబడడం కారణంగా, వ్యవసాయ రంగానికి నష్టం కలిగింది.

ఉదాహరణకు, మన రాష్ట్రంలో 2011-12, 2024-25 సంవత్సరాల మధ్య, ఆహారధాన్యాల కింద సాగు అయిన భూమి విస్తీర్ణం 104.5 లక్షల ఎకరాలనుంచి 93.75 లక్షల ఎకరాలకు తగ్గింది. (/http://www.apsdps.ap.gov.in/assets/publications/Socio-Economic-Survey-2024-25.pdf). ఆ కారణంగా, రాష్ట్ర ఆహార భద్రతకు హాని కలగడమే కాకుండా, లక్షలాది మంది చిన్నకారు రైతులు, ముఖ్యంగా SC/ST/OBC లకు చెందిన ప్రజలు నిర్వాసితులు అయి, వారి జీవనోపాధికి నష్టం కలిగింది.

పరిశ్రమల కోసం, ఇతర ప్రయోజనాల కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముందున్న 1894 భూ సేకరణ చట్టం కింద, రైతుల నుంచి బలవంతంగా తక్కువ నష్టపరిహారం ఇచ్చి, భూములను పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. భూసేకరణలో ప్రజలకు లాభం కలిగించే దిశలో, కేంద్రంలో అప్పటి UPA ప్రభుత్వం, 2013 లో కొత్త భూసేకరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టం కింద, భూసేకరణ కారణంగా నష్టపోయిన వారి ముందస్తు సమ్మతి లేకుండా భూములను తీసుకోవడం చెల్లదు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రైవేటు భూములను సేకరించవలసి వస్తే, ముందు ప్రభుత్వం, వారికి ఉదారంగా నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, వారికి పునరావాస సౌకర్యం కలిగించాలి.

2013 చట్టంలో 10 వ సెక్షన్ కింద, ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఆహార భద్రతకు భంగం కలిగించే దిశలో పెద్ద ఎత్తున భూసేకరణ జరగకూడదు.

అదే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు బదలాయించడాన్ని నియంత్రించడం కోసం, 2006 లో నాలా చట్టాన్ని [Andhra Pradesh Agricultural Land (Conversion for Non Agricultural Purposes) Act] ప్రవేశపెట్టింది.

2013 లో కేంద్రం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని బలహీనపరిచే దిశలో మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలను చేయడం జరిగింది. అదే కాకుండా, ఆ చట్టం కింద ప్రభుత్వం నిర్వాసితులకు ముందస్తు నష్టపరిహారం ఇవ్వడానికి బదులు, మన రాష్ట్ర ప్రభుత్వం "ల్యాండ్ పూలింగ్" విధానాన్ని ప్రవేశ పెట్టి, నిర్వాసితులకు భవిష్యత్తులో వారి భూములు బదులు ప్లాట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలు సేకరిస్తూ, ప్రభుత్వం, ఆహార భద్రత లక్ష్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది.

పరిశ్రమల కోసం, ఇతర ప్రయోజనాల కోసం భూములను తీసుకోవడం దిశలో ప్రభుత్వం ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. అదేకాకుండా సాగు భూములను ఇతర ప్రయోజనాలకు తరలించడం వల్ల, రాష్ట్రంలో వేలాదిమంది చిన్నకారు ప్రజలకు, ముఖ్యంగా SC/ST/OBC లకు చెందిన ప్రజల జీవితాలకు నష్టం కలిగే అవకాశం ఉంది.

ఇదే నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల ఒత్తిడికి లొంగి, వ్యవసాయ భూములను ఇతర ప్రయోజనాలకోసం తరలించడాన్ని నియంత్రించే "నాలా" చట్టాన్నికూడా త్వరలో రద్దుచేస్తుందనే వార్త చూసాను. (https://thesouthfirst.com/andhrapradesh/reform-push-andhra-government-to-do-away-with-nala-to-ease-bureaucratic-hurdles/)

ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం వలన, రాష్ట్ర ఆహార భద్రతను భంగ పరచడమే కాకుండా, వ్యవసాయరంగం మీద ఆధారపడే లక్షలాది మంది పేద ప్రజల జీవనోపాధికి నష్టం కలిగించడం అవుతుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.

ల్యాండ్ పూలింగ్ విధానం వలన, నాలా చట్టం రద్దు వలన, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు 2013 భూసేకరణ చట్టం కలిగించిన హక్కులను నష్టపోయి, వారి జీవనోపాధులు పోగొట్టుకునే అవకాశం ఉంది. అటువంటి నిర్ణయాలను ప్రభుత్వం పునః పరిశీలించాలి.

ప్రైవేట్ రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రోత్సహించడం కోసం, ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవడం వల్ల, రాష్ట్రాభివృద్ధి లో భాగస్వాములైన, చిన్నకారు వ్యవసాయదారులు, సంప్రదాయ మత్స్యకారులు, సహకార రంగ డైరీ సంస్థల ద్వారా లాభం పొందుతున్న చిన్న\ పాల ఉత్పత్తి దారులు లక్షలాదిమంది నష్టపోవడం బాధాకరమైన విషయం. ప్రభుత్వ విధానాలు ప్రజల అభివృద్ధికి దోహదం చేయాలి. కాని ప్రైవేటు కంపెనీల లాభాలు పెంచడం కోసం కాదని ప్రభుత్వం గుర్తించాలి.

ఇట్లు.. EAS శర్మ, రిటైర్డ్ ఐఏఎస్, పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి.

Tags:    

Similar News