Puttaparthi | సత్యసాయి 100వ జయంతికి ముందస్తు ఏర్పాట్లు

నవంబర్ 23న శ్రీ సత్యసాయిబాబా జయంతి నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ట్రస్టు సభ్యులు, అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-18 14:53 GMT
పుట్టపర్తి ప్రశాంతినిలయంలో సత్యసాయి సమాధి (ఫైల్)

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి ఘనంగా నిర్వహించడానికి అధికారులు ముందస్తు ఏర్పాట్లకు సన్నాహాలు

ప్రారంభించారు. ఈ నవంబర్ 23వ తేదీ సత్యసాయి జయంతి జరుగుతుంది. సత్య సాయి ట్రస్ట్ సభ్యులు, జిల్లా అధికారులతో కలెక్టర్ టి.ఎస్.చేతన్ బుధవారం సమీక్షించారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పి రత్న , జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి, శ్రీసత్య సాయి ట్రస్ట్ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టిఎస్. చేతన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీసత్యసాయి బాబా జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సీమ శిగలో మణిమకుటం

రాయలసీమ జిల్లాలు ఆధ్మాత్మిక క్షేత్రాలకు నెలవుగా ఉన్నాయి. ఉమ్మడి అనంతరం జిల్లాలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం కూడా ప్రధానమైంది. సత్యసాయి సంస్థ ప్రతినిధుల సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. పంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా, కొందరు భక్తులు ఈ సంఖ్యను ఐదే కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంటుందని విశ్లేషిస్తారు.
1926 నవంబర్ 23వ తేదీ పుట్టపర్తి అనే గ్రామంలో వ్యవసాయ భట్టురాజు దంపతులు వెంకటప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణరాజు (సత్యసాయి) పుట్టిన సమయంలో వారి ఇంట సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ఆయన ప్రకటించుకున్నారు. 2011 ఏప్రిల్ 23న ఆయన శివైక్యం చెందారు. ఆ మధ్య కాలంలోనే శ్రీసత్య సాయిబాబా ఆధ్యాత్మిక ప్రబోధనలతో ప్రపంచ వ్యాపితంగా భక్తులు ఏర్పడ్డారు. దేశ ప్రముఖ నేతలెందరూ అతిథులుగా వచ్చే వారు. పుట్టపర్తితో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్య, వైద్య సంస్థలతో సేవలు ఇప్పటికీ అందిస్తున్నారు. సత్యసాయిబాబా శివైక్యం తరువాత ట్రస్టు సభ్యులు ఆ కార్యక్రమాలు పర్యవేక్థిస్తున్నారు.
ఏర్పాట్లపై సమీక్ష.. ఆరు హెలిపాడ్లు

సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, జిల్లా అధికారులతో సమవేశమైన శ్రీసత్యసాయి కలెక్టర్ టిఎస్. చేతన్

సత్యసాయి వందవ జయంతికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చేతన్ గుర్తు చేశారు. అతిథులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా, అప్పగించిన బాధ్యతలు అధికారులు సంసిద్ధం చేయాలన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా వీవీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరు హెలిపాడ్లు సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాత్కాలిక వసతి ఏర్పాట్లతో పాటు తాగునీరు, తాత్కాలిక టాయిలెట్స్, వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో కూడా తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆయన ఇంకా ఏమి సూచించారంటే..
"పుట్టపర్తి పట్టణం తోపాటు చిత్రావతి నది సుందరీకరణ కనువిందు చేయాలి. ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించే విధంగా ఉండాలి. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, రవాణా సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి" అని కలెక్టర్ చేతన్ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఇప్పటికే చేపట్టిన పనులను ఆయన తెలుసుకున్నారు.
హారతి కేంద్రాల వద్ద

మాట్లాడుతున్న కలెక్టర్ చేతన్, చిత్రంలో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న

సత్యసాయి జయంతి సందర్భంగా పట్టణంలో హారతి ఇచ్చే చిత్రావతి, కమ్మవారిపల్లి, కప్పలబండ, ఎంఎస్ఎంఈ..పాయింట్స్ వద్ద యాత్రికులకు ఇబ్బంది లేకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ చేతన్ గుర్తు చేశారు. ఈ ప్రదేశాల్లో ప్రముఖులు కూడా ఉంటారు కాబట్టి, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. వివిధ మార్గాలను, పాయింట్స్ ను భక్తులకు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
"ప్రతి కేంద్రం వద్ద ఖచ్చితంగా వైద్య శిబిరాలు ఏర్పాటకు కార్యాచరణ సిద్ధం చేయండి" అని కలెక్టర్ చేతన్ డిఎంహెచ్ఓ ఫిరోజ్ బేగంను ఆదేశించారు. సమీక్షలో పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, డిఆర్డీఏ, డ్వామ పీడిలు నరసయ్య, విజయ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News