ఏనుగుల దాడి నుంచి ప్రజలను, పంటలను కాపాడండి

కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని తులసిరెడ్డి అన్నారు.;

Update: 2025-06-05 12:52 GMT

ఏనుగుల దాడి నుంచి ప్రజలను, పంటలను కాపాడాలని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌ తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం వేంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏనుగుల బీభత్సం ఎక్కువైందని అన్నారు. వీటి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంట నష్టం కూడా ఎక్కువగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం, నీటి కొరత తదితర కారణాల వల్ల అడవులలో ఉండాల్సిన ఏనుగులు సమీపం లోని గ్రామాల్లోకి రావడం, పంటలు ధ్వంసం చేయడం, మనుషులను చంపడం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా, ఐరాల మండలం నాగంవాండ్ల పల్లి వద్ద బుధవారం గణపతి అనే రైతు పొలాన్ని ఏనుగులు ధ్వంసం చేయడమే కాకుండా.. ఆయనపై దాడి చేసి దారుణంగా చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలు చిత్తూరు, అన్నమయ్య, విజయనగరం జిల్లాలలో తరచుగా జరుగు తున్నాయని, ఇవి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక నుండి తెచ్చిన కుంకీ ఏనుగులు ఏమయ్యాయో తెలియకుండా వుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, వికసిత భారత్, విజన్‌–20247 వంటి డైలాగులు మాని ఏనుగుల దాడి నుండి ప్రజలను, పంటలను కాపాడాలని తులసి రెడ్డి డిమాండ్‌ చేశారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించు కోవడం మనందరి ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం, ఎక్కువై పోతోందని, దీనిని నివారించక పోతే మానవ జాతి మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో.. నాటిన మొక్కలను పెంచడం, వాటిని కాపాడు కోవడం అంతకంటే ముఖ్యమని అన్నారు. ప్రభుత్వాలు మొక్కలను నాటడం మీద పెట్టిన శ్రద్ధ పరిరక్షించడంలో పెట్టడం లేదని విమర్శించారు. ఈ చర్యలు చేపట్టకుండా ఇది ఫోటోల ప్రహసనంగా తయారై పోయిందన్నారు. ఇప్పటికైనా మొక్కలను, చెట్లను పరిరక్షించడంలో నిర్మాణాత్మక పాత్ర ప్రభుత్వం పోషించాలని తులసిరెడ్డి సూచించారు. ఈ విషయంలో పాలకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆదర్శంగా తీసుకోకుండా అశోకుడిని ఆదర్శంగా తీసుకోవాలని తులసిరెడ్డి పేర్కొన్నారు.


Tags:    

Similar News