ఏనుగుల దాడి నుంచి ప్రజలను, పంటలను కాపాడండి
కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని తులసిరెడ్డి అన్నారు.;
ఏనుగుల దాడి నుంచి ప్రజలను, పంటలను కాపాడాలని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం వేంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏనుగుల బీభత్సం ఎక్కువైందని అన్నారు. వీటి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంట నష్టం కూడా ఎక్కువగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం, నీటి కొరత తదితర కారణాల వల్ల అడవులలో ఉండాల్సిన ఏనుగులు సమీపం లోని గ్రామాల్లోకి రావడం, పంటలు ధ్వంసం చేయడం, మనుషులను చంపడం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం నాగంవాండ్ల పల్లి వద్ద బుధవారం గణపతి అనే రైతు పొలాన్ని ఏనుగులు ధ్వంసం చేయడమే కాకుండా.. ఆయనపై దాడి చేసి దారుణంగా చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలు చిత్తూరు, అన్నమయ్య, విజయనగరం జిల్లాలలో తరచుగా జరుగు తున్నాయని, ఇవి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక నుండి తెచ్చిన కుంకీ ఏనుగులు ఏమయ్యాయో తెలియకుండా వుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, వికసిత భారత్, విజన్–20247 వంటి డైలాగులు మాని ఏనుగుల దాడి నుండి ప్రజలను, పంటలను కాపాడాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.