అమరావతి రెండో శంకుస్థాపనకు ప్రధాని మోదీ 2న రాక
అమరావతికి మే నెల 2న మళ్లీ శంకుస్థాపన జరుగుతుంది. ఈసారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరుగుతుంది.;
By : The Federal
Update: 2025-04-15 13:13 GMT
అమరావతికి మే నెల 2న మళ్లీ శంకుస్థాపన జరుగుతుంది. ఈసారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 15న జరిగిన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చెప్పారు.
క్యాబినెట్ లో ఆయన చెప్పిన విషయాలు...
మే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఉంటుంది. అమరావతి పనులను మోదీ రీస్టార్ట్ చేస్తారు. మూడేళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తి అవ్వాల్సిందే. అసెంబ్లీలో అంతర్గత వసతి మొత్తం ఎలా ఉండాలనే అన్న అంశంపై మంత్రులు చర్చించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల పర్యటను వెళ్లినప్పుడు మూడు పార్టీలు నేతలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలి. సూర్యఘర్ను పథకాన్ని ఇంకా వేగంగా అమలు చేయాలి. ప్రభుత్వ భవనాలపైనా సూర్యఘర్ ఫలకాలు అమర్చాలి. రాజకీయంగా మేమంతా ఎక్కడా తప్పు చేయడం లేదు. కానీ అధికారుల అవినీతిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీన్ని వారు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తగిన చర్యలు ఉంటాయి. జిల్లాస్థాయిల్లో రెవెన్యూ అంశాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. అందరూ జాగ్రత్తగా పని చేయాలి" అని చంద్రబాబు చెప్పారు.
అందరి లెక్కా తేలుస్తా...
ఆంధ్రప్రదేశ్లో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల, తిరుమల గోశాల, వక్ఫ్ బిల్లు వంటి అంశాలపై వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, పాస్టర్ ప్రవీణ్ విషయంలో అన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో అశాంతి రేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.
"మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్గా చెప్పి చేద్దాం. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో మనం క్లియర్గా ఉన్నాం. వక్ఫ్ బిల్లుపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించింది. ఆ పార్టీ ఎంపీలు లోక్ సభలో వ్యతిరేకిస్తూ రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు. మరోవైపు బయటకు వచ్చి మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ వైఖరి ఎలా ఉందనేది అందరికీ అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజధాని అమరావతిలో అన్ని పనులకు టెండర్లు పిలిచాం. రహదారులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పనకూ టెండర్లు పిలిచాం. భవనాల అన్నింటికీ టెండర్లు ఖరారు చేశాం అని చంద్రబాబు చెప్పారు.