పీఏ వాంగ్మూలం..ఎంపీ అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు

రాఘవరెడ్డి పోలీసుల విచారణ సంచలనంగా మారింది. ఎంత మంది వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్టు చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.;

By :  Admin
Update: 2024-12-11 07:09 GMT

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ పీఏ రాఘవరెడ్డి పోలీసుల విచారణ, విచారణలో రాఘవరెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. పీఏ ఇచ్చిన వాంగ్మూలం ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మెడకు చుట్టుకునేందుకు మెండుగా అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంకా మరి కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు కూడా అది చుట్టుకునే అవకాశం ఉందని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఇది ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం మొదలైన విచారణ బుధవారం కూడా కొనసాగుతోంది. సోమవారం, మంగళవారాల్లో రాఘవరెడ్డిని సుదీర్ఘంగా విచారణ చేపట్టిన పోలీసులు సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలపై కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. డీఎస్పీ మురళీ నాయక్‌ ఆధ్వర్యంలో కడప సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. ఇది వరకు వర్రా రవీందరరెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

రాఘవరెడ్డి ఆదేశాల మేరకే వైఎస్‌ షర్మిల, సునీత, విజయమ్మలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందరరెడ్డి పోలీసులు చెప్పగా.. వర్రా రవీందరరెడ్డి ఎవరో తనకు తెలియదని రాఘవరెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును వెల్లడించిన వర్రా రవీందరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఆఫీసు నుంచి వచ్చిన కంటెంట్‌ అంతా రాఘవరెడ్డి వాట్సాప్‌ నుంచి వచ్చిందని, రాఘవరెడ్డి చెప్పిన మేరకే తాను వైఎస్‌ విజయమ్మ, షర్మిల, సునీతల మీద సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని, సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపైన కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు ఎటుతిరిగి ఎలా తేలుతుందో అనేది ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News