జగన్‌పై బలవంతపు చర్యలొద్దు

సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;

Update: 2025-06-27 09:31 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చీలి సింగయ్య మృతి కేసులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీలి సింగయ్య కేసుకు సంబంధించి కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించింది. కారు ప్రమాదం జరిగితే కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు ఎలా నమోదు చేస్తారు? కారులో ఉన్న వారిని సింగయ్య ప్రమాదానికి ఎలా బాధ్యులన్ని చేస్తారు? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాడు కుంభమేళాలో తొక్కిసలాట సంఘటన చోటుచేసుకోలేదా? అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ జరిగేంత వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కోర్టును కోరగా.. ఆ మేరకు అనుమతులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై1 మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపైన ఎలాంటి తొందరపాటు, బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్‌ కారు కింద పడి మృతి చెందారనే ఆరోపణలపై కారు డ్రైవర్‌ రమణారెడ్డి కారులో ప్రయాణిస్తున్న జగన్‌లను ఏ1, ఏ2 నిందితులుగా పేర్కొంటూ వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య లూర్థు మేరీ ఫిర్యాదు మేరకు గుంటూరు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌లపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన మీద పోలీసులు నమోదు చేసిన సింగయ్య మృతి కేసును కొట్టివేయాలని క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. జగన్‌తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌లు కూడా హైకోర్టులో బుధవారం క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. వీటిపైన గురువారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తమకు సమయం కావాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరడంతో శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపైన బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబందించి తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరడంతో తదుపరి విచారణను జూలై 1 మంగళవారంకు వాయిదా వేసింది.
Tags:    

Similar News