జగన్పై బలవంతపు చర్యలొద్దు
సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చీలి సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీలి సింగయ్య కేసుకు సంబంధించి కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించింది. కారు ప్రమాదం జరిగితే కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు ఎలా నమోదు చేస్తారు? కారులో ఉన్న వారిని సింగయ్య ప్రమాదానికి ఎలా బాధ్యులన్ని చేస్తారు? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాడు కుంభమేళాలో తొక్కిసలాట సంఘటన చోటుచేసుకోలేదా? అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ జరిగేంత వరకు నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కోర్టును కోరగా.. ఆ మేరకు అనుమతులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై1 మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితులపైన ఎలాంటి తొందరపాటు, బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది.