నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏపీలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ టోనీ బ్లెయిర్ తో లోకేష్ భేటీలో నిర్ణయం

విద్యా రంగంలో ఏఐ వినియోగంపై టోనీ బ్లెయిర్ తో చర్చించిన లోకేష్;

Update: 2025-06-19 13:28 GMT

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూకే మాజీ ప్రధాని,టీబీఐ (Tony Blair Institute For Global Change)వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో సమావేశం అయ్యారు. విద్యా రంగంలో ఏఐ వినియోగంపై చర్చించిన వీరు,నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, స్కిల్‌డెవలప్‌మెంట్ ట్రైనింగ్, గుడ్ గవర్నెన్స్ కోసం గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సహకరించుకోవడానికి అంగీకరించారు.ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సాంకేతికంగా సహాయం అందించనుంది. యువతకు ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టోనీ బ్లెయిర్‌ను గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరమని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. వచ్చే ఆగస్టులో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రాల విద్యా మంత్రుల సదస్సులో టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ వెల్లడించారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండోరోజు లోకేష్ పలు కంపెనీల ప్రతినిధులు,ప్రముఖులతో సమావేశం అయ్యారు.

 

అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించండి
అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, క్రీడాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. కేంద్ర మంత్రి తో సమావేశమైన లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్దికి చేపడుతున్న చర్యలను వివరించారు.సానుకూలంగా స్పందించిన మాండవీయ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అమరావతిలో రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని.. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపిన లోకేష్ ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామన్నారు.ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించడమే అమరావతి స్పోర్ట్స్ సిటీ లక్ష్యం అని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులకు మద్దతునివ్వడం కోసం , ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం సహకరించాలని లోకేష్ కోరారు. పాఠశాల, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు,నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలన్నారు.కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్‌లో హాకీ, షూటింగ్‌లకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తామని, ఖేలో ఇండియాలో భాగంగా క్రీడా మౌలిక సదుపాయాల కోసం రూ.341.57 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని లోకేష్ కోరారు.దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్‌లను మంజూరు చేయాలన్నారు.రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో లోకేష్ ఏపీ అభివృద్దికి సంబంధించి పలువురు కేంద్రమంత్రులతో చర్చించారు.
Tags:    

Similar News