తిరుమల:పెద్ద శేషవాహనంపై కనువిందు చేయనున్న మలయప్ప
25వ తేదీ నాగులచవితి వేడుక.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-12 15:08 GMT
తిరుమలలో బ్రహ్మోత్సవాలలోనే కాదు. పండుగలు, విశేష సందర్భాల్లో మలయప్ప స్వామి పల్లకీపై ఊరేగుతూ దర్శనం ఇస్తారు. అందులో భాగంగానే ఈ నెల 25వ తేదీ నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల ఆలయ మాడవీధుల్లో ఊరేగనున్నారు. రాత్రి ఏగు గంటల నుంచి తొమ్మది గంటల వరకు ఈ వాహనసేవ జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు
ఇది చరిత్ర
తిరుమల శ్రీవారి వాహనసేవల నిర్వహణ వెనుక చారిత్రక నేపథ్యం, కథలు ఉన్నాయి. అందులో పెదశేష వాహనం నిర్వహించడంలో ఆంతర్యం ఇదీ. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్ర నామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. అలా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింప చేస్తారు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడనేది చారిత్రక కథనం.