అంచెలంచెలుగా ఎదిగి.. అడవి తల్లి ఒడిలోనే ఒదిగి..
పదేళ్ల క్రితం తమ్ముడు, ఆర్నెల్ల కిందట భర్త హతమయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిదీ వామపక్ష భావజాలమే.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-06-18 12:16 GMT
ఆమె పేరు వెంకట రవి లక్ష్మి చైతన్య అలియాస్ అరుణ. వయసు 55 ఏళ్లు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకుంది. తల్లిదండ్రులది వామపక్ష భావజాలం నేపథ్యం కావడంతో ఆమె కూడా చిన్నతనంలోనే విప్లవాన్ని ఒంటబట్టించుకుంది. రెండు పదుల ప్రాయంలోనే అడవి బాట పట్టింది. తుపాకీ చేతబట్టి సాయుధ పోరాటంలోకి దిగింది. ఆ ప్రయాణంలో సోదరుడిని, భర్తను కోల్పోయింది. మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగింది. చివరకు అడవి తల్లి ఒడిలోనే ఒదిగిపోయింది.
ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అరుణ
బుధవారం వేకువజామున అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం– మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, మరో మావోయిస్టు అంజుతో పాటు అరుణ కూడా ఉన్నారు. అరుణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఆమె తల్లిదండ్రులు కరకవానిపాలెంలోనే ఉంటున్నారు. తండ్రి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వీరికి ముగ్గురు సంతానం. వారిలో అరుణ పెద్దది కాగా సోదరుడు (గోపి అలియాస్ ఆజాద్), సోదరి (న్యాయవాది)గా ఉన్నారు. ఆజాద్ కూడా సోదరి అరుణ బాటలోనే సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. ఆపై 2006లో అడవులకు పయనమయ్యారు. అనంతరం సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. గాలికొండ ఏరియా దళ కమాండర్గా పనిచేస్తున్న సమయంలో 2016లో అప్పటి విశాఖ జిల్లా కొయ్యూరు–జీకేవీధి అటవీ ప్రాంతం మర్రిపాకల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ హతమయ్యారు. సోదరి విశాఖలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గతంలో గంగవరం పోర్టు వ్యవహారంలో మత్స్యకారుల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి కేజీహెచ్కు తరలించారు. మావోయిస్టు సానుభూతిపరురాలు అనే నెపంతో ఆమెను కేజీహెచ్లో మంచానికి సంకెళ్లు వేసి బంధించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.
మావోయిస్టులు హతమార్చిన మాజీ ఎమ్మల్యేలు కిడారి, సివేరి సోమ
మెట్రిక్యులేషన్ చదువుకుని..
ఇక అరుణ మెట్రిక్యులేషన్ వరకు చదువుకుంది. కొన్నాళ్లకు ఆమె చదువుకంటే సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు న్యాయం చేయవచ్చన్న భావనతో మావోయిస్టు ఉద్యమ మార్గాన్ని ఎంచుకుంది. అలా ఆమె ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉంది. అరుణ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి రెండో భార్య. శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడుకు చెందిన చలపతి మొదటి భార్య రుక్మిణి గతంలో రుక్మిణి మరణించడంతో ఆయన అరుణను వివాహమాడారు. అయినప్పటికీ అరుణ పేరే తప్ప ఫోటో ఎలా ఉంటుందో పోలీసులు సహా బాహ్య ప్రపంచానికి తెలియలేదు. రామ్గుడా ఎన్కౌంటర్లో పోలీసులకు లభ్యమైన ల్యాప్టాప్లో అరుణ ఫోటో తొలిసారిగా కనిపించింది. అగ్రనేత చలపతి భార్య కావడంతో పాటు ఏవోబీలో కీలక పదవిలో ఉండడం వల్ల అరుణ నిత్యం తన వెంట ఏకే 47 ఉంచుకునేదని, ఆమెకు ఆరుగురు అంగరక్షకులు ఉండేవారని చెబుతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఓడిశా–చత్తీస్గఢ్ సరిహద్దు గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి మరణించారు. తొలి భార్య స్వస్థలం బొడ్డపాడులోనే చలపతికి అంత్యక్రియలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సోమల హత్యలో ..
2018లో అప్పటి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో మావోయిస్టులు పట్టపగలే కాల్చి చంపారు. వీరి హత్యలో కీలక సూత్రధారి, పాత్రధారి అరుణేనని పోలీసులు అంచనాకొచ్చారు. ఆ ఘటనలో ఆమె స్వయంగా పాల్గొన్నారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమెపై రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు. అప్పట్నుంచి అరుణ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా ఫలితం లేదు.
ఎన్నోసార్లు తప్పించుకుని..
దాదాపు మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే గడుపుతున్న అరుణ ఎన్నో సార్లు ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. అమెను సజీవంగానైనా పట్టుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల అదుపులో ఉందని కొన్నిసార్లు, అనారోగ్యం పాలై మరణించిందని మరికొన్ని సార్లు వదంతులు వచ్చాయి. ఇన్నాళ్లూ అవన్నీ నిజం కాలేదు. కానీ బుధవారం తెల్లవారుజామున మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అరుణ నిజంగానే చనిపోయింది! చిన్న వయసులోనే అలా అడవిబాట పట్టిన అరుణ ఆఖరుకు అడవి తల్లి ఒడిలోనే ఒరిగిపోయింది.