కూటమి నేతలు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు

కరేడు రైతులకు న్యాయవాదుల బృందం మద్దతు తెలిపిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.;

Update: 2025-08-24 14:54 GMT

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కూటమి నాయకులు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. నవరత్నాల్లో ఒకటైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి ఇంత వరకు సొంత గనులు లేవన్నారు. దేశంలో సొంత గనులు లేని ఏకైక స్టీల్‌ ప్లాంట్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అని, సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందని, వీటిని సాకుగా చూపి, ప్రజలను మభ్యపెట్టి ప్రైవేటు పరం చేసేందుకు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందకి వంద శాతం అమ్ముతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇదే నిర్ణయం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పిందని, విశాఖ స్టీల్‌ను అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే.. ప్రజల చెవిలో కూటమి నేతలు పువ్వులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని కీలకమైన 32 విభాగాలను ప్రైవేటు పరం చేస్తే కూటమి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని నిలదీశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన వారికి ఇంత వరకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
రైతుల పంటని పచ్చని పొలాలపైనే సీఎం చంద్రబాబు కన్ను పడిందని మండిపడ్డారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం 65వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే.. రైతులు పోరాటాలు చేసి దానిని అడ్డుకున్నారని వెల్లడించారు. అదేవిధంగా కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపైన కూడా రైతులు పోరాటాలు చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. అయితే కరేడులో మూడు పంటలు పండే పంట పొలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. కరేడు భూములపై ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారని, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన వారిని ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. న్యాయవాదుల బృందం కేరేడు రైతుల పోరాటానికి మద్దతు తెలిపిందన్నారు. బీపీసీఎస్‌ పేరుతో 6వేల ఎకరాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని, పోర్టు వస్తోంది కాబట్టి.. చవకగా భూములను కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. భూముల కోసం రైతులు చేస్తున్న పోరాటాల్లో భాగస్వాములు అవుతామన్నారు.
Tags:    

Similar News