ఏపీకి కుంకీ ఏనుగులు

రంజనీ, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర కుంకీ ఏనుగులను ఏపీకి కర్ణాటక అందజేసింది.;

Update: 2025-05-21 10:12 GMT

కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కుంకీ ఏనుగులను అప్పగించింది. బెంగుళూరులోని విధానసౌధలో బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రంజనీ, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర అనే కుంకీ ఏనుగులను అప్పగించారు. ఆ మేరకు కుకీ ఏనుగుల అప్పగింత పత్రాలతో పాటు వాటి పోషణ, వాటి సంరక్షణకు సంబంధించిన పత్రాలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు.


ఈ సంర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందజేసినందుకు కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి సాయం కోరినా దానిపై తక్షణమే స్పందించి చేసేందుకు ముందుకు రావడంతో సంతోషకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య ఇప్పటి వరకు తొమ్మిది కీలక ఒప్పందాలు జరిగాయని, స్నేహపూరిత వాతావరణంలో ఇరు రాష్ట్రాలు, ఇరు ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు పవన్‌ తెలిపారు. కర్ణాటక నుంచి ఏపీకి తీసుకెళ్తున్న కుంకీ ఏనుగులకు ఏపీలో ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అడవి ఏనుగులు పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. వీటి బారి నుంచి పంట పొలాలను రక్షించుకునేందకు కుంకీ ఏనుగులు తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అందులో భాగంగా బుధవారం కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం అందజేసింది. వీటి రాకతో పంటపొలాలను కాపాడుకోవడానికి వీలుంటుంది. కుంకీ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఏపీకి అప్పగించిన కుంకీ ఏనుగులు కూడా పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నవే. పంటపొలాల్లోకి గుంపులు గుంపులుగా అడవి ఏనుగులు వచ్చి పడిపోయినప్పడు ఈ కుంకీ ఏనుగులను రంగంలోకి దింపుతారు. ఆ అడవి ఏనుగులను తరమి కొట్టడంతో పాటు చిక్కుకున్న అడవి ఏనుగులను, గాయపడిన అడవి ఏనుగులను కాపాడేందుకు కూడా ఈ కుంకీ ఏనుగులను ఉపయోగపడుతాయి. అడవి ఏనుగులను అడవిలోకి తరిమేంత వరకు ఈ కుంకీలు విశ్రమించవు, వాటితో కలబడటానికి కూడా వెనుకాడవు. ఈ నేపథ్యంలో వీటి దెబ్బకు అడవి ఏనుగులు తొకముడుచుకుంటాయి. ఆడ కుంకీల కంటే మగ కుంకీలనే ఎంచుకుంటారు. వీటికి నెలల తరబడి తర్ఫీదు ఇస్తారు. శిక్షణలు పూర్తి అయిన తర్వాత ప్రత్యేకమైన పరిస్థితుల్లో రంగంలోకి దింపి పంట పొలాలను కాపాడుకుంటారు.
Tags:    

Similar News