ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్థిక మంత్రులు

కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-11-28 08:12 GMT

ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు. మన దేశానికి కూడా ఆర్ధిక మంత్రిగా మహిళే నిర్మలా సీతారామన్ ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశాన్ని ప్రధాన మంత్రి అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే...ఆర్థికమంత్రి ఆదేస్థాయిలో సహకరిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగింది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో 15 బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారని అన్నారు.

రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు. ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి. రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం. బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,  ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు వచ్చాయి. ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నాను అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఓ కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఒప్పందం జరిగింది. ప్లానెటోరియం ఏర్పాటు చేసేందుకు అమరావతిలో స్థలం కూడా కేటాయించాం. ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలం అన్న విశ్వాసం మాకు ఉంది. త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తి అవుతుంది. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయి. 7 జాతీయ రహదారులు, రైల్వేలైన్లు అమరావతికి కనెక్టు అవుతాయి. అమరావతి పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం.  భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తాం. విట్,ఎస్ఆర్ఎం, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వచ్చాయి. క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ట్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా ప్రణాళిక చేశాం అని చంద్రబాబు అన్నారు. 
 2047కి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అందులో ఏపీది కీలక పాత్ర పోషిస్తుంది. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్లీ రీస్ట్రక్చర్ చేసేందుకు కేంద్రం సహకరించింది. రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రాం వాల్ ధ్వంసం అయితే మళ్లీ రూ.1,000 కోట్లు ఇచ్చి డయాఫ్రాం వాల్ నిర్మాణం చేసేందుకు నిధులిచ్చారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అలాగే 2028 నాటికి కూడా అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయి. పరిశ్రమలు రాకుండా పారిపోయిన ఏపీకి మళ్లీ కూటమిపై భరోసాతో పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.37లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి. పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలు వాడుకుని దేశసంపద పెంచేలా రాయలసీమకు నీళ్లు పారించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్టటంలో ఈ నీరు కీలకం అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. పూర్వోదయ ప్రాజెక్టు కింద ఉదారంగా నిధులు ఇస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి.  కేంద్ర సహకారం వల్ల చాలా వరకూ రాష్ట్రం రికవర్ అవుతోంది. నిలదొక్కుకుని దేశప్రగతికి, సంపదకు బ్యాక్ బోన్ గా ఏపీ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను. కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 
Tags:    

Similar News