మండలానికో ‘జన ఔషధి’ స్టోర్

అమరావతిలో నేచురోపతి యూనివర్సిటీ. త్వరలో ‘యోగా ప్రచార పరిషత్.’;

Update: 2025-08-25 17:06 GMT
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

జన ఔషధి స్టోర్లు (జనరిక్ మెడికల్ షాపులు) పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో తక్కువ ధరకు మెడిసిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రూ.25 లక్షల వరకు వైద్య బీమాపై కసరత్తు

ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపైనా సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ది కలుగుతుండగా, దీనిని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపైనా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.24 బెడ్స్ ఉండగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశకాల ప్రకారం 3 బెడ్లు ఉండాలని సూచించిందని అన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో మరో 12,756 పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

వ్యాధులపై అవగాహన

ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందుకోసం యోగా, నేచరోపతిని ప్రమోట్ చేసేలా ‘యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యులను నియమించేందుకు అనుమతించారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

కుప్పంలో ఉచిత వైద్య పరీక్షలు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే క్రమంలో తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, రామకుప్పంతో పాటు మరిన్ని ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే శాంపిల్ కలెక్షన్ టీమ్‌లు పెంచాలని స్పష్టం చేశారు.

గ్రామానికి ‘ఆరోగ్య రథం’

‘ఆరోగ్యం రథం’తో ప్రతీ పల్లెలోనూ మొబైల్ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు. మరోవైపు ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు తీసుకొచ్చిన పలు రకాల కిట్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. బేబీ కిట్స్ పథకం త్వరలోనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మోడల్ ఇంక్లూజివ్ సిటీగా అమరావతి

పెర్కిన్స్ ఇండియా, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో అమరావతిలో ‘మోడల్ ఇన్‌క్లూజివ్ సిటీ’ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులను సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

Tags:    

Similar News