మొదలైన వైసీపీ ప్రక్షాళన.. పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు

అధికారం పోయినప్పటి నుంచి తిరిగి బలం పుంజుకోవడంపై పార్టీ అదిష్ఠానం ఫోకస్ పెట్టింది. క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేపట్టింది.

Update: 2024-09-13 17:38 GMT

అధికారం పోయినప్పటి నుంచి తిరిగి బలం పుంజుకోవడంపై పార్టీ అదిష్ఠానం ఫోకస్ పెట్టింది. క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ స్థితి గతులపై అధ్యక్షుడు సీఎం జగన్ పలు నివేదికలు అందుకున్నారు. తాజాగా పార్టీ ప్రక్షాళనను కూడా ప్రారంభించారు. ఈ విషయంపైనే చిత్తూరు జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అందులోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనను నగరి నియోజకవర్గం నుంచే ప్రారంభించారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో ప్రస్తుతం మాజీ మంత్రి అయిన ఆర్కే రోజాకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేసిన నేతలపై పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు జగన్.

ఆ నేతలకు ఝలక్

నగరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ నిర్ణయం సదరు నేతలకు భారీ షాక్‌గా మారింది. వారి సస్పెన్షన్ లేఖను చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ విడుదల చేశారు. వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్, కేజే శాంతి సహా వారి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యలయానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందింది. వారిపై వచ్చిన అభియోగాలు వాస్తవమైనవేనని ధృవీకరిస్తూ వారిపై క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకుంది. కమిటీ సిఫార్సు మేరకు వారిని పార్టీ నుంచి తొలగిస్తూ, వారి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం. ఇకపై వారి కార్యక్రమాలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’’ అని ఆయన ప్రకటనలో వెల్లడించారు.




 

పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు

పార్టీ ప్రక్షాళనలో భాగంగానే వైసీపీ పార్టీలో పలువురు నేతలకు కీలక బాధ్యతల అప్పగింతను కూడా చేపట్టింది పార్టీ అధిష్ఠానం. ఈ మేరకు తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధులను ప్రకటించింది. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు అందాయి. ఆయనను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు మాజీ సీఎం జగన్. ఈ బాధ్యతలతో పాటుగా అదనంగా నాలుగు నియోజకవర్గాల బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఈయనతో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్‌కే రోజా, ఆరె శ్యామలను పార్టీ అధికార ప్రతినిధులుగా ప్రకటించింది పార్టీ. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

Tags:    

Similar News