రేషన్ అక్రమ రవాణా గుట్టు రట్టు, భారీగా బస్తాలు స్వాధీనం
కృష్ణా జిల్లా సూరంపల్లిలో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు
By : The Federal
Update: 2025-10-02 17:08 GMT
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు, సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల బరువైన 500 బస్తాలు (అంటే 25 టన్నులు) అక్రమ రేషన్ మాఫియా మూడో కంటికి తెలియకుండా గుట్టుగా దాచినట్లు తేలింది. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. గన్నవరం పోలీసులు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడి చేసి ఈ బస్తాలను పట్టుకున్నారు.
రేషన్ అక్రమ రవాణా, నిల్వ కేంద్రంగా గన్నవరం మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ నిల్వలు చూసి స్థానికులు ఖంగుతిన్నారు. రేషన్ వ్యాపారిపై కేసు నమోదు చేసి, బియ్యం బస్తాలను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ దాడి రేషన్ మాఫియా బాగోతాన్ని బహిర్గతం చేసింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరిన్ని దాడులు చేస్తామని అక్రమార్కులను హెచ్చరించింది. రేషన్ బియ్యం దారిద్య్ర రేఖకు కింద ఉన్న పేదలకు పంపించాల్సినది, దీన్ని అక్రమంగా విక్రయించడం మోసం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.