పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌గుప్తా

అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్‌లను పక్కన పెట్టి హరీష్‌కుమార్‌ గుప్తా వైపు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది.;

Update: 2025-05-26 16:29 GMT

ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తాను ఇక నుంచి పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ప్రకారం సోమవారం నుంచి రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్లా కొనసాగనున్నారు. కేంద్రం నుంచి ఇటీవల వచ్చిన ప్యానెల్‌ నుంచి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా పేరును కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది.

కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు సంబంధించిన ఐపీఎస్‌ అధికారుల్లో సీనియర్‌ అధికారి అయిన ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన జనవరి నెలాఖరులో పదవీవిరమణ పొందారు. తర్వాత 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తాను ఇన్‌చార్జి డీజీపీగా నియమించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్‌కుమార్‌ గుప్తాకు ఏపీ డీజీపీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇతని కంటే సీనియర్‌ అయిన 1991వ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ను అగ్నిమాపక శాఖ డీజీగా నియమించారు. 2024 స్వారత్రిక ఎన్నికల సమయంలో హరీష్‌కుమార్‌ గుప్తా డీజీపీగా పని చేశారు. అప్పటి వరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. దీంతో ఎన్నికల సమయంలో హరీష్‌కుమర్‌ గుప్తా డీజీపీగా పని చేశారు.
అయితే ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న హరీష్‌కుమార్‌ గుప్తానే çపూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏప్రిల్‌ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌తో పాటు యుపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో కూడిన ప్యానల్‌ బృందం డీజీపీ ఎంపికపై ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేశారు.
వీరిలో 1992 వ బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తాతో పాటు 1991వ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, 1990వ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌లు ఉన్నారు. అయితే అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్‌ కంటే జూనియర్‌ అధికారి అయిన హరీష్‌కుమార్‌ గుప్తా వైపే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇప్పటికే జనవరి నుంచి ఇన్‌చార్జి డీజీపీగా ఆయన కొనసాగుతుండటం, హరీష్‌కుమార్‌ గుప్తా పనితీరు కూటమి ప్రభుత్వానికి సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయించుకున్నారు.
Tags:    

Similar News