పెట్టుబడులపై ఆశలు పెంచుతున్న ప్రభుత్వం
ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో 19 జూన్ 2025న స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 సంస్థలు మొత్తం రూ.28,546 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుమతులను త్వరితగతిన క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు సూచించారు.
పెట్టుబడుల అమలు, పారదర్శకత, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, ఈ పెట్టుబడులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇవన్నీ కాగితాలకే పరిమితమా? అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.
పెట్టుబడుల వివరాలు
సమావేశంలో ఆమోదం పొందిన 19 సంస్థలు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలు
రేమ్ండ్ రూ.1,201 కోట్లు, 6,571 మందికి ఉద్యోగాలు (వివిధ ప్రాంతాల్లో)
జి.ఇన్ఫ్రా ప్రెసీజియన్స్ లిమిటెడ్ రూ.1150 కోట్లు, 299 మంది ఉద్యోగాలు (అనంతపురం)
సంగం డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.130 కోట్లు, 400 మంది ఉద్యోగ, ఉపాధి (తిరుపతి)
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1583 కోట్లు, 8000 ఉద్యోగాలు - 3 దశల్లో(విశాఖపట్నం)
3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.224 కోట్లు, 750 మందికి ఉద్యోగాలు (తూర్పు గోదావరి)
ఏబీఐఎస్ ప్రొటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.350 కోట్లు, 790 మందికి ఉద్యోగాలు (చిత్తూరు)
రిలయన్స్ కన్య్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1622 కోట్లు, 1200 మందికి ఉద్యోగాలు (ఓర్వకల్లు)
మెల్గాన్ లైజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రూ.225 కోట్లు, 350 మందికి ఉద్యోగాలు (ఏలూరు)
పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియర్ రూ.80 కోట్లు, 300 మందికి ఉద్యోగాలు ( తిరుపతి)
గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ రూ.145 కోట్లు, 250 మందికి ఉద్యోగాలు (అమరావతి)
బెర్రీ అల్లోస్ లిమిటెడ్ రూ.573 కోట్లు, 320 మందికి ఉద్యోగాలు. (శ్రీ సత్యసాయి జిల్లా)
చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,323 కోట్లు, 540 మందికి ఉద్యోగాలు. (కడప)
అదానీ రెన్యువబుల్ ఎనర్జీ ఫిఫ్టీ వన్ లిమిటెడ్ రూ.8,010 కోట్లు, 3,500 మందికి ఉద్యోగాలు(కడప)
చానల్ ప్లే రూ.80 కోట్లు, 1100 మందికి ఉద్యోగాలు(కొప్పర్తి)
అదానీ హైడ్రో ఎనర్జీ ఫోర్ లిమిటెడ్ అండ్ అదానీ హైడ్రో ఎనర్జీ వన్ లిమిటెడ్ రూ.10,900 కోట్లు, 7,000 మందికి ఉద్యోగాలు. (రాష్ట్రంలోని వివిధ జిల్లాలు)
బీపీసీఎల్ అండ్ కేఎస్ఎస్ఎల్, ఎల్టీ ఎలక్ట్రానిక్స్, కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్లో అదనపు పెట్టుబడులు, మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
సీఎం చంద్రబాబు సూచనలు
సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో పెట్టుబడుల అమలు ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టారు. కీలక సూచనలు చేశారు.
1. త్వరిత అనుమతులు: పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. బ్యూరోక్రసీ జాప్యాన్ని నివారించాలి.
2. పర్యవేక్షణ: ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.
3. పారిశ్రామిక విధానం: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ద్వారా దేశీ, విదేశీ సంస్థలను ఆకర్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
ఇంధనం, ఐటీ, పర్యాటకం, మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాలలో పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. 30,270 మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. చంద్రబాబు గత అనుభవం, పారిశ్రామిక అనుకూల విధానాలు పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.