Road terror | నా పాప ఎక్కడయ్యా..?
కర్ణాటకలో లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించారు. అందులో నెలన్నర బిడ్డ కనిపించక ఓ తల్లి తల్లడిల్లుతోంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-13 05:26 GMT
ఇనుప చువ్వలతో ముందు వెళుతున్న లారీని దాటి ముందుకు వెళ్లాలనే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మరణించారు. అందులో ఒకటిన్నర నెల పాప కూడా ఉంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ పాప తల్లి గిరిజ, తండ్రి, మూడు సంవత్సరాల అన్నకు ఈ విషయం తెలియదు. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం వేకువజామన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది గాయపడ్డారని చిత్తూరు -1 డిపో మేనేజర్ సి. రూపశ్రీ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
డ్రైవర్ వెనుక భాగంలో ఛిద్రమైన చిత్తూరు డిపో ఆర్టీసీ బస్సు
"ఇనుప తుక్కు లోడుతో వెళుతున్నలారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ వేయడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది" అని రూపశ్రీ వివరించారు.
చిత్తూరు నుంచి ప్రయాణికులతో గురువారం రాత్రి 9:30 గంటలకు ఆర్టీసీ బస్సు కర్ణాటకలోని పుటన హళ్లికి బయలుదేరింది. కర్ణాటకలోని హోసకోట సమీపంలో ఉన్న గొట్టిపుర వద్ద ఇనుప తుక్కుతో వెళుతున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు అధిగమించే యత్నంలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ విఎల్కే. రెడ్డి తీవ్రంగా గాయపడడంతో పాటు బస్సు కుడి భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చేర్చారు. కొందరికి ఎముకలు కూడా విరిగాయని చిత్తూరు 1 డిపో మేనేజర్ రూపశ్రీ చెప్పారు. "బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ఆస్పత్రి వద్దే ఉన్నాం" అని రూపశ్రీ వివరించారు. ఆమె కథనం మేరకు ఈ ప్రమాదంలో కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (5), ఏడాదిన్నర చిన్నారి మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తులసి (21) కూడా మృతి చెందింది. ఆమె కర్ణాటకలో బీటెక్ చదువుతున్నట్లు ప్రాథమిక సమాచారం.
గొట్టిపుర చెక్పోస్ట్ సమీపంలో ప్రమాద సంఘటన జరగానే స్థానికులు స్పందించారు. గాయపడిన ప్రయాణికులను హోస్కోట్ సమీపంలో ఉన్న సిటీ సిలికాన్ ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకకు చిత్తూరు అధికారులు
కర్ణాటక రాష్ట్రం హాస్కోట వద్ద ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్తూరు-2 డిపో మేనేజర్ సి. రూపశ్రీ సహచర అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు సేకరించడంతోపాటు వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు.
"ప్రమాదం తీవ్రంగానే ఉంది. ఓవర్ టేక్ చేయడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది" అని ఆర్టీసీ చిత్తూరు వన్ డిపో మేనేజర్ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. "గాయపడిన ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందించడానికి, అక్కడ ఉన్న తమ అధికారికి సహకారం అందించాలని ఘటనా స్థలానికి వెళుతున్న" అని డిఎం కృష్ణమూర్తి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును విశ్లేషించిన తర్వాత అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆయన సూచన పాయంగా చెప్పారు.