ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి తల్లికి వందనం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు మాట్లాడారు.;

Update: 2025-06-12 09:18 GMT

సూపర్‌ సిక్స్‌లో తల్లిక వందనం అత్యంత కీలకమైందని, ఒకరికిచ్చి.. మిగిలిన వాళ్లకు ఇవ్వకపోవడం కరెక్టు కాదని భావించి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 42లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తే.. కూటమి ప్రభుత్వం సుమారు 67లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా గురువారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా తల్లికి వందనం అమలు జీవోను మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు అందజేశారు. తల్లికి వందనం పథకం గురించి ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు తల్లికి వందనం నగదును వారి గార్డియన్‌ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ట్రాన్స్‌పరెన్సీ పాటించడం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను కూడా డిస్‌ప్లే ఉంటుందన్నారు. ఈ నెల 26 వరకు గడువు ఉందని.. జూన్‌ నెలాఖరు 30 నాటికి ఫైనల్‌ జాబితాను ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 67 లక్షల మంది విద్యార్థుల కోసం రూ. 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం కింద జమ చేసే ఈ మొత్తంలో నుంచి రూ. 1,346 కోట్లు పాఠశాలల డెవలప్‌మెంట్‌ కోసం వెళ్తుందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి ఉన్న గైడ్‌లైన్స్‌నే తల్లికి వందనం స్కీమ్‌కు కొనసాగిస్తామన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మ ఒడి ఇస్తే.. కూటమి ప్రభుత్వం 67,27,164 మందికి వర్తింప చేస్తున్నామని, నాటితో పోల్చితే అదనంగా 24,65,199 మందికి తల్లికి వందనం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. నాడు వైసీపీ ప్రభుత్వం రూ. 5,540 కోట్లు కేటాయిస్తే.. తాజాగా కూటమి ప్రభుత్వం రూ. 8,745 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. అంటే వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే అదనంగా రూ. 3,205 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను ధ్వంస చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖజానాకు వచ్చిన మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎమ్మార్వో ఆఫీసులను కూడా వదల్లేదని మండిపడ్డారు. తన సొంత బాబాయ్‌ని గొడ్డలి చంపి.. తన చేతిలో కత్తి పెట్టే ధైర్యం, దానిని పత్రికలో వేసే ధైర్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు వారి ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, అమరావతి దేవతల రాజధాని అయితే వేశ్యల రాధాని అంటారా? తెనాలిలో గంజాయి, రౌడీలకు జగన్‌ మద్ధతు ఇస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంసం పాలన నుంచి వికాస పాలనకు ఏడాది కాలం పూర్తి అయిందని, 60 శాతం మంది కుటుంబాలకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని మంత్రి లోకేష్‌ వెల్లడించారు.
Tags:    

Similar News