మత్స్యకార ఇంట సాహితీ ‘మైరావణుడు’
ఇంటర్మీడియట్ వరకు చేపలు పట్టిన ప్రసాద్.. సాహిత్యంపై మక్కువ పెంచుకుని అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-06-30 04:33 GMT
ఏ పిల్లలైనా ఐదారేళ్ల ప్రాయంలో ఏం చేస్తారు? ఆటపాటలతోనో, అల్లరి చేష్టలతోనో గడుపుతారు. కానీ ఈ జాలరి పిల్లోడు అలా చేయలేదు. కనిపించిన పేపర్లను, పుస్తకాలను తిరగేయడానికి ప్రయత్నించేవాడు. వచ్చీరాని భాషతో చదవడానికి, అందులో ఉన్న బొమ్మలను తెలుసుకోవడానికి తాపత్రయ పడేవాడు. అలా అలా ఆ కుర్రోడు సాహిత్యాభిలాషి అయ్యాడు. తాను రాసిన మూడు నవలల్లో రెండో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యాడు. పాతికేళ్లకే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. మత్స్యకార ఇంట సాహితీ ‘మైరావణు’డయ్యాడు. ఆ నవ యువకుడి పేరు సూరాడ ప్రసాద్.. కలం పేరు ప్రసాద్ సూరి..! ప్రసాద్,
ప్రసాద్ సూరి
సూరాడ ప్రసాద్ది ఉమ్మడి విశాఖ (ప్రస్తుత అనకాపల్లి) జిల్లా రాంబిల్లి మండలం వాడ నర్సాపురం గ్రామం. మత్స్యకారు (వాడబలిజ)లైన తల్లిదండ్రులు సూరాడ చంద్రరావు, నూకరత్నం. చేపలవేటతో జీవనం సాగించే వీరు అక్కడ నుంచి పల్నాడు జిల్లా మాచర్లకు యాభై ఏళ్ల క్రితం వలప వెళ్లి అక్కడ అదే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రసాద్. ప్రాథమిక విద్య అమ్మమ్మ గారి ఊరు వాడ రాంబిల్లిలోను, ఇంటర్మీడియట్ యలమంచిలిలోను, డిగ్రీ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) హైదరాబాద్లోనూ సాగింది. ప్రస్తుతం గుజరాత్ బరోడాలోని మహారాజా సయాజీరావు యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రసాద్ ఇంటర్మీడియట్ చదువుకునే వరకు సముద్రంలో చేపలవేటకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచేవాడు. ప్రస్తుతం ప్రసాద్ తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా చేపలవేట వృత్తితోనే జీవనోపాధి సాగిస్తున్నారు.
ఫైన్ ఆర్ట్స్ వేస్తూ..
పసిప్రాయంలోనే సాహిత్య బీజం..
సాధారణంగా సాహిత్యాభిలాషులు, సాహితీవేత్తలకు విద్యావంతులైన కుటుంబమో లేదా సాహిత్య నేపథ్యమో ఉంటుంది. ప్రసాద్ తల్లిదండ్రులు, తాతమామ్మలు నిరక్షరాస్యులు. చేపలవేటే జీవనాధారంగా బతికేవారు. కానీ ఐదారేళ్ల వయసుకే ప్రసాద్కు పేపర్లు, బొమ్మలపై ఆసక్తి మొదలైంది. అది హైస్కూలు విద్యకు వెళ్లేసరికి ముదిరింది. పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం అలవాటైంది. ఖాళీ సమయాల్లో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను, పురాణేతిహాసాలు, చరిత్రను చదవడంపై దృష్టి సారించాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఆరంభంలో చిన్న చిన్న కథలు రాసేవాడు. అలా తొలిసారిగా తన 19వ ఏటనే ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’ అనే నవల రాశాడు. తొలి నవల బాగా రాశానన్న సంతృప్తితో ‘మైరావణ’ అనే మలి నవలకు శ్రీకారం చుట్టాడు ప్రసాద్.
మైరావణ నవల కవర్ పేజి
నాన్నమ్మ చెప్పిన కథతోనే..
ప్రసాద్ చిన్నతనంలో నాన్నమ్మ వద్ద ఉండేవాడు. అప్పట్లో ఆమె తన మనవడికి కథలు చెబుతుంటే ఊకొడుతూ నిద్రపోయేవాడు. అలా తన వాడబలిజ కులం పుట్టుపూర్వోత్తరాలను ప్రసాద్కు చెప్పింది. వాడబలిజలు అసలు కులవృత్తి ఓడలను తయారు చేయడం, ఓడలపై వ్యాపారం చేయడం అని, కాలక్రమంలో అది కనుమరుగై చేపలవృత్తిలోకి మారినట్టు నాన్నమ్మ చెప్పిన మాటలను ఒంటబట్టించుకున్నాడు. దాని ఆధారంగా వాడ బలిజల వందేళ్ల చరిత్రను అధ్యయనం చేశాడు. అపై ప్రసాద్ ‘మైరావణ’ నవలకు నడుం బిగించాడు. 170 పేజీల ఈ నవలలో వాడబలిజ కులస్తుల జీవన స్థితిగతులు, కాలక్రమంలో వచ్చిన వృత్తి మార్పులు, కష్టాలు, కన్నీళ్లు, రాజకీయాలు వంటి వాస్తవిక అంశాలకు కాస్త కాల్పనికతను జోడించాడు. తన రచనలకు సాల్మన్ రష్దీ, అమితవ్ ఘోష్లు స్ఫూర్తిదాతలని చెబుతాడు ప్రసాద్ సూరి.
రెండో నవలతోనే సాహిత్య అకాడమీ పురస్కారం..
ప్రసాద్ సూరి ఇప్పటివరకు మూడు నవలలు రాశారు. తొలి నవల మై నేమ్ ఈజ్ చిరంజీవి. రెంవది మైరావణ. మూడవది బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నవల. ‘మైరావణ’ నవలకే ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది. వాస్తవానికి అ పురస్కారం కోసం ఈయన దరఖాస్తు చేయలేదు. ఆయన తరఫున మరొకాయన పంపడంతో అది 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఇటీవల ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఎందరో ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రసాద్నే వరించింది. వాస్తవానికి ఈ యువ పురస్కారానికి 35 ఏళ్ల లోపు సాహితీవేత్తలకు ఇస్తారు. ప్రసాద్ వయసు పాతికేళ్లు కావడంతో ఇంత పిన్న వయసులో అ అవార్డు దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడు.
ప్రసాద్ సూరి
ఈ పురస్కారాన్ని ఊహించలేదు..
‘నేను నా బాల్యంలో పడిన కష్టాలు, మా తల్లిదండ్రులు, తాతలు, మా కులస్తులు, కుటుంబీకులు చేపలవృత్తితో పడుతున్న బాధలు, అవస్థలను కళ్లారా చూశాను. వాటిలో చాలావరకు మైరావణ నవలలో ప్రతిబింబించేలా రాశాను. మత్స్యకారుల జీవన స్థితిగతులపై కొంతమంది రాశారు. కానీ నేను ఆ కులంలో పుట్టి, సాధక బాధకాలను స్వయంగా అనుభవించి, దానికి నాకున్న జ్ఞానాన్ని కూర్చి రాశాను. ఈ నవలలో పురాణాలు, జానపద, వర్తమాన మైరావణుల పాత్రను జోడించాను. నాకు మైరావణ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తెచ్చిపెడుతుందని అస్సలు ఊహించలేదు. నేను నా నవలను అవార్డు కోసం రాయలేదు. ఎందరో సాహితీవేత్తలు పోటీపడ్డ ఈ అవార్డు నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేను నా కెరీర్పైనే దృష్టి సారిస్తాను. నేను చదువుకున్న ఆర్కియాలజీపై ఫోకస్ పెట్టి స్థిరపడతాను. వీలున్నప్పుడల్లా రచనలు సాగిస్తాను. పెయింటింగ్స్ కూడా ఇష్టం. దానిని కొనసాగిస్తాను’ అని సూరాడ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ సూరి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.