దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి: ప్రకాష్‌రాజ్‌ తాజా ట్వీట్‌

లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ స్పందించారు. జస్ట్‌ ఆస్కింగ్, జస్ట్‌ ప్లీడింగ్‌ అంటూ పోస్టు చేశారు.

Update: 2024-09-30 14:56 GMT

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై మరో బాణం సంధించారు. సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా మరో ట్వీట్‌ చేశారు. లడ్డూ వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేయడం గమనార్హం. తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబుపైన, ఏపీ ప్రభుత్వంపైన కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను జత చేస్తూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ’దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆ పోస్టులో ప్రస్తావించారు. తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలతో కూడిన క్లిప్పింగ్‌ ఉండటంతో మరో సారి చర్చనీయాంశంగా మారింది. తిరుపతి తిరుమల లడ్డూ వివాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని అందులో పేర్కొనడం గమనార్హం. ల్యాబ్‌ రిపోర్ట్‌ సవివరంగా లేదని, అలాంటప్పుడు మీరు నేరుగా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు.

Tags:    

Similar News