ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం చందనోత్సవంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి ఆ దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల అవినీతి, విశాఖ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయ నాడు సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామికి చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఏడాది పొడవునా స్వామికి పూసిన చందనాన్ని ఆరోజు తొలగించాక అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు, తోపులాటలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తుంటారు. నెల రోజుల ముందు నుంచే కసరత్తు మొదలు పెడతారు. కానీ ఈ సారి చందనోత్సవానికి ఏం జరిగింది?
సింహాచలం చందనోత్సవ సందర్భంగా ఎప్పుడూ దుర్ఘటనలు జరగలేదు. ఆ ఆలయ చరిత్రలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలవడం ఇదే తొలిసారి. 2005లో సింహగిరి రోడ్డు వేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి 13 మంది మరణించారు. అయితే అది దేవస్థానంలోనూ కాదు.. చందనోత్సవ వేళ కాదు.
ఎక్స్గ్రేషియా ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చందనోత్సవం దుర్ఘటన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. మతుల కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇస్తామని తెలిపింది. అలాగే సింహాచలం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున చెల్లించనున్నట్టు పీఎం సహాయ నిధి నుంచి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ దుర్ఘటనపై దర్యాపు జరపడానికి సీఎం చంద్రబాబు ముగ్గురితో కమిటీని వేశారు. గోడ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరుపైనా? సంబంధిత దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులపైనా? భద్రతపై పర్యవేక్షణను పట్టించుకోని అధికారులపైనా? వీరిలో ఎవరిని బాధ్యులను చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
దిగ్భ్రాంతి ప్రకటనలు..
సింహాచలం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం, డిప్యూటీ సీఎంలు యధావిధిగా ప్రకటించారు. కాగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధిత కుటుంబ సభ్యుల పరామర్శకు బుధవారం సాయంత్రం విశాఖ వస్తున్నారు.
సాఫ్ట్వేర్ దంపతుల దుర్మరణం
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరం మధురవాడలోని చంద్రంపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (27)లు ఉన్నారు. ఈ దంపతులకు మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. నగరంలోని హెచ్బీ కాలనీలో ఉంటున్న శైలజ తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జారి మహలక్ష్మిలు చనిపోయారు. మరో ఇద్దరు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన మణికంఠ ఈశ్వర శేషారావు, పత్తి దుర్గా ప్రసాద్ నాయుడు. వీరిద్దరూ స్నేహితులు. మణికంఠ విశాఖ సీతమ్మధారలో ఉంటూ ఇంటీరియర్ డెకరేటర్ వత్తిలో ఉన్నాడు. దుర్గాప్రసాద్ ఓ సంస్థలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. కాగా మరొకరిని విశాఖ స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సింహాచలం అడవివరానికి చెందిన యడ్ల వెంకట్రావు లుగా గుర్తించారు.
కేజీహెచ్ వద్ద రోదనలు..
మతులను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ముఖ్యంగా మహేష్ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో వారి బంధువుల ఆర్తనాదాలకు అంతులేకుండా పోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సాఫ్ట్వేర్ దంపతులు మహేష్, శైలజలను గుర్తు చేసుకుంటూ వారి బంధువులు హదయవిదారకంగా విలపించారు. స్నేహితులైన మణికంఠ, దుర్గా ప్రసాద్ నాయుడులిద్దరూ మరణంలోనూ ఏకమై వెళ్లిపోయారా? అంటూ వారి బంధువులు రోదించారు. మతుల బంధువులు కేజీహెచ్ మార్చురీ వద్ద ఉండడంతో మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించారు.
మృతుల వివరాలు..
1. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29), అంబాజీపేట, కోనసీమ జిల్లా
2. పత్తి దుర్గా ప్రసాద్ నాయుడు (30), అంబాజీపేట, కోనసీమ జిల్లా
3. యడ్ల వెంకట్రావు (58), అడవివరం, సింహాచలం
4. పిళ్లా ఉమామహేశ్వరరావు (30), చంద్రంపాలెం, విశాఖపట్నం
5. పిళ్లా శైలజ (27) , చంద్రంపాలెం, విశాఖపట్నం
6. గుజ్జారి మహాలక్ష్మి (65), హెచ్బీ కాలనీ, విశాఖపట్నం
7. పైలా వెంకటరత్నం (45), హెచ్బీ కాలనీ, విశాఖపట్నం