కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులందరం కలసికట్టుగా పనిచేసి బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను తీసుకువచ్చాం. దీనివల్ల గత 16నెలల్లో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని గుర్తించాం. తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నా వారు స్థానికంగా పనిచేయకపోవడానికి అదే ప్రధాన కారణం. అందువల్లే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టిపెట్టాం. ఫలితంగా గత 16నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.10లక్షల కోట్లు) ఏపీకి వచ్చాయి. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ద్వారా రూ.1.5లక్షల కోట్లు, దేశచరిత్రలో అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ $15 బిలియన్ డాలర్లు, నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ లక్ష కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.25లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డొమెస్టిక్ ఇన్వెస్టిమెంట్ లోనే కాకుండా ఎఫ్ డీఐలలో కూడా ఏపీ నెం.1గా నిలుస్తూ ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అవలంభిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్లే కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయి. పక్కరాష్ట్రాలు కూడా పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నా ఏపీ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణం. టీసీఎస్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యుపవర్ వంటి భారీ కంపెనీలు అందువల్లే క్యూకట్టాయి. ఏపీలో అద్భుతమైన సీ కోస్ట్ లైన్ ఉంది. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోట ఉంది. సమర్థవంతమైన టాలెంట్ పూల్, పోర్టు లాజిస్టిక్ లింకేజి ఉంది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఎన్ఎండీసీ స్లరీ పైప్ లైన్ కు కేంద్రం అనుమతించడంతో ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రాష్ట్రంలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిసారించాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం. అందుకు అనుగుణంగానే అనంతపురం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో సీబీజీ, నెల్లూరులో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, అమరావతిలో క్యాంటమ్ కంప్యూటింగ్, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైస్, స్టీల్ సిటీ, డేటా సిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగా ఆయా ప్రాంతాల్లో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, సిఫీ సంస్థ 500 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మా టార్గెట్ రాష్ట్రంలో 6 గిగావాట్ల డాటా సెంటర్లు ఏర్పాటు చేయడం. అందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఎకో సిస్టమ్ తీసుకురావాల్సి ఉంది. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ కు ప్రాధాన్యత నిస్తున్నాం.
ఆస్ట్రేలియాకి వెళ్లివచ్చాక నాలుగు విదేశీ వర్సిటీలతో చర్చలు జరుపుతున్నాం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశోధనలకు జేమ్స్ కుక్ యూనివర్సిటీతో, స్పోర్ట్స్ అభివృద్ధికి గ్రిఫిత్ వర్సిటీతో చర్చలు జరుపుతున్నాం. సోలార్ సెల్, క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి కూడా ఇతర వర్సిటీలతో మాట్లాడుతున్నాం. ఈసారి మరింత వేగంగా అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. పార్టనర్ షిప్ సమ్మిట్ లో 2.7లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5లక్షల ఉద్యోగాలు కల్పించే సంస్థలకు భూమిపూజ చేయబోతున్నాం. ఈ సమ్మిట్ కేవలం ఒప్పందాల కోసమే కాదు...ఏపీ యువత ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. ప్రముఖమైన అన్ని సెక్టార్లలో లీడర్ షిప్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ డేటా సంస్థలు ఏపీకి వస్తున్నాయి, స్టీల్, అల్యూమినియం, ఏఐ, ఆగ్రిటెక్, డ్రోన్ తదితర అన్నిరంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నదే మా ధ్యేయం. విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమాన్ని మేం త్రీవే పార్టనర్ షిప్ గా భావిస్తున్నాం. ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామిక సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన పయనిస్తుంది. నిన్న కూడా ముంబయిలో అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశాను. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఏపీ వైపు చూస్తున్నారు. అయినా మేం సంతృప్తి చెందడం లేదు. అన్నిరంగాల్లో ఏపీని నెం.1 చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అయితే వైసీపీ, మాజీ సీఎం వైఎస్ జగన్ మాత్రం కులం, మతం, ప్రాంతం ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.